ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 27, 2020, 4:52 AM IST

ETV Bharat / city

'రాజధానిపై పునరాలోచించే వరకు...వెనకడుగు వేయం'

అమరావతి రైతుల రణఘోష 41వ రోజుకు చేరుకుంది. అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తమ నిరసనలపై ఎందుకు స్పందించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యమం కేవలం 29 గ్రామాల రైతులదే కాదంటూ పొరుగుప్రాంతాల వారూ పాల్గొన్నారు.

amaravati farmers protest
amaravati farmers protest

పరిపాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల్లో నిరసనల హోరు కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్త వ్యతిరేకతను ముఖ్యమంత్రి కనీసం గమనించట్లేదంటూ మందడం రైతులు అన్నారు. పాలనకు అవసరమైన అన్ని భవనాలూ ఉన్న అమరావతి నుంచి రాజధాని తరలింపు నిర్ణయం రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టేనని మండిపడుతున్నారు.

మహిళల సంఘీభావం

విజయవాడ ధర్నాచౌక్‌లో రాజధాని రైతుల దీక్షకు మద్దతుగా మహిళలు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. తాడికొండ నుంచి వందలాదిమంది మహిళలు ట్రాక్టర్లపై తుళ్లూరు చేరుకుని అక్కడి నుంచి వెలగపూడి, మందడం వరకూ ర్యాలీగా తరలి‌వచ్చారు. 3 రాజధానులు వద్దు ఒక రాజధాని ముద్దంటూ నినాదాలు చేశారు. ఉద్దండరాయనిపాలెంలో‌ కాల‌భైరవ యాగం‌ చేసిన శివస్వామికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. నెలకుపైగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఉలుకూపలుకూ లేదని మండిపడ్డారు. వికేంద్రీకరణ బిల్లును మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపి రైతుల ఉద్యమానికి ఊపిరి పోశారన్నారు.

విద్యార్థులు సైతం..

రాజధాని నిరసనల్లో విద్యార్థులు పాల్గొన్నారు. అమరావతి పోరులో రైతులు ఒంటరి కాదని ఉద్యమంలో పాల్గొనేందుకు పొరుగు ప్రాంతాల నుంచి వచ్చినట్లు విద్యార్థులు, మహిళలు చెప్పారు. రాజధానికి భూములిచ్చిన ప్రజలతో బిల్లులపై చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని నిలదీశారు.

కొవ్వొత్తుల ర్యాలీ

విజయవాడ పరిధిలోనూ నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో గన్నవరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాజధాని అభివృద్ధి సహా విమానాశ్రయ అభివృద్ధికీ భూములిచ్చామని రైతులు వాపోయారు. రాజధాని తరలిపోతే తమ త్యాగాలు వృథా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 3 రాజధానుల అంశాన్ని ప్రభుత్వం పునరాలోచించే వరకూ వెనకడుగేసే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:అమరావతి రైతుల ఉద్యమానికి ప్రవాసాంధ్రుల సంఘీభావం

ABOUT THE AUTHOR

...view details