విశాఖకు చెందిన ఓ యువ బృందం...కొవిడ్ సవాళ్లను అధిగమించే దిశగా టెక్ పరిష్కారంతో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఏడాది తొలిమాసంలో సూపర్ వ్యూ అనే సాఫ్ట్ వేర్ కంపెనీని యువకులు విశాఖలో నెలకొల్పారు. బృంద స్ఫూర్తితో విజయవంతంగా నడపాలని భావిస్తున్న తొలిరోజుల్లోనే కొవిడ్ మహమ్మారి వారి కలలకు అడ్డుపడింది. టెక్నాలజీపై ఆ యువకులకు ఉన్న పట్టు... కొవిడ్ కు అడ్డుకట్ట వేసే దిశగా ఆలోచనలకు అవకాశాన్ని కల్పించింది. అప్పటి వరకు చేస్తున్న ప్రాజెక్టులకు మార్పులు చేసి ప్రస్తుత దశలో ఎంతో కీలకంగా ఉన్న భౌతిక దూరం అంశంపై దృష్టి సారించారు. ఇందుకోసం సోషల్ డిస్టెన్స్ మోనిటర్గా పిలిచే సాంకేతిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
ఇలా పనిచేస్తుంది....
సోషల్ డిస్టెన్స్ మోనిటర్ గా పిలిచే ఈ పరిజ్ఞానాన్ని ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం సహా మ్యాన్ కైండ్ ఫార్మా సంస్థ సైతం వినియోగానికి తీసుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా పని చేస్తూ... నిర్దేశించిన దూరం కంటే ఏ ఇద్దరు దగ్గరగా కదిలినా వెంటనే గుర్తించడం ఈ పరిజ్ఞానం ప్రత్యేకత. తిరుమలలో అమలు చేసిన విధానంలో ఓ మార్పును చేశారు. కేవలం గమనిస్తూ ఉండడం కాకుండా అప్రమత్తం చేసే విధానాన్ని అక్కడ ప్రవేశ పెట్టారు. భౌతిక దూరాన్ని ఏ ఇద్దరు పాటించకపోయినా వెంటనే ఓ గంట మోగిన శబ్దం అక్కడ వస్తుంది.. వెంటనే వారు అప్రమత్తమై దూరంగా జరగడానికి అవకాశం కల్పిస్తోంది. బృందం సహకారంతోనే కొవిడ్ వ్యాప్తి నివారణ దిశగా ప్రాజెక్టులపై పని చేస్తున్నామని సూపర్ వ్యూ సీఈఓ రాజా కొణతాల చెబుతున్నారు.
మాస్క్ ధరించినా గుర్తుపట్టేస్తోంది...