ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కోట' దాటేందుకు.. ఉప రాష్ట్రపతి మాట సాయం!

రాజస్థాన్​లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను ఆదుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. లోక్​సభ స్పీకర్ ఓంబిర్లాను కోరారు. స్పందించిన స్పీకర్... తెలుగు వారికి నిత్యావసర సరుకులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

By

Published : Apr 26, 2020, 12:51 PM IST

కోట దాటేందుకు ఉపరాష్ట్రపతి సాయం
కోట దాటేందుకు ఉపరాష్ట్రపతి సాయం

రాజస్థాన్‌లో చిక్కుకున్న తెలుగువారికి సహకారం అందించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య... రాజస్థాన్​లోని కోట నియోజకవర్గ ఎంపీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కోరారు. తెలుగువారికి నిత్యావసర సరుకులు అందించి, ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తామని స్పీకర్ ఓంబిర్లా హామీ ఇచ్చారు. అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించి, స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాని స్పీకర్‌ తెలిపారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేస్తున్నామని ఓంబిర్లా చెప్పారు.

జరిగిందేంటి?

జేఈఈ, నీట్‌ కోచింగ్‌కు రాజస్థాన్‌లోని కోటకు వెళ్లిన తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 200మంది విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. మొదట ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌ అనంతరం ఇళ్లకు వెళ్లిపోవచ్చని అనుకుని, 15న రైళ్లకు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించిన కారణంగా.. అయోమయంలో పడిపోయారు.

ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు తమ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్లిపోయాయి. చాలా ప్రైవేటు వసతి గృహాలు ఖాళీ అయిపోయాయి. కొన్ని హాస్టళ్లలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులే మిగిలారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు వీరికి వంటచేసి పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. తమకు ఆహారం సరిగా అందడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటలో కరోనా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి అభ్యర్థన మేరకు.. లోక్ సభ స్పీకర్ స్పందించారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి:

కరోనా వేళ.. తల్లిపాలు శ్రేయస్కరమేనా?

ABOUT THE AUTHOR

...view details