Polavaram bills as per 2013 14 rates: పోలవరం ప్రాజెక్ట్ బిల్లులు చెల్లించేందుకు కేంద్రం కొర్రీలు వేస్తోంది. 2013-14 ధరల ప్రకారమే చెల్లింపులకు అంగీకరించినందున.. ఆ మేరకే ఇస్తామని స్పష్టం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పంపే బిల్లులను సిఫార్సు చేయని P.P.A.. సీలింగ్ పేరిట ఎక్కడికక్కడ కోతలు విధిస్తోంది. పోలవరం పనుల్లో కేంద్రం చెప్పేదానికి, రాష్ట్ర ప్రభుత్వం చేసే పనికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. కొన్ని పనులకు కేంద్రం నిర్ణయించిన అంచనాల మొత్తం ఎప్పుడు దాటిపోవడంతో, బిల్లులు చెల్లించేందుకు అంగీకరించడం లేదు.
తాజాగా ప్రాజెక్ట్ హెడ్వర్క్స్లో చేసిన పనులకు జలవనరులశాఖ 102.2 కోట్లు బిల్లు పంపగా.... అంత మొత్తానికి అర్హత లేదని ప్రాజెక్టు అథారిటీ తేల్చింది. కేవలం 7.94 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇప్పటివరకూ కేంద్ర ఆర్థికశాఖ అంగీకారం ప్రకారం ఇంతకు మించి బిల్లు చెల్లించే అవకాశం లేదని తెలిసింది. భూసేకరణ, పునరావాసానికి ప్రస్తుతం సిఫార్సు చేసిన బిల్లు చెల్లిస్తే... రానున్న రోజుల్లో పెట్టే కొత్త బిల్లులు మంజూరు కావడం కష్టమే. పోలవరం ప్రాజెక్టులో ఏ పనికి ఎంత మొత్తమన్నది కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. దీని ప్రకారం కొన్ని పనులకు నిర్ణయించిన మొత్తం దాటిపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పెట్టినా P.P.A సిఫార్సు చేయడం లేదు. ఏ పనికి ఎంత ఇవ్వాలన్న సీలింగ్తో గత మే 19 వరకు వచ్చిన బిల్లుల్లో.. 2వేల 266 కోట్ల రూపాయల బిల్లులను P.P.A. సిఫార్సు చేయలేదు.
ఈ నెల 2న కేంద్ర జలసంఘానికి P.P.A. పంపిన నివేదికలో.. రాష్ట్రం కోరినట్లుగా మొత్తం బిల్లు సిఫార్సు చేయకపోవడానికి కారణాలను వివరించింది. మే 19 తర్వాత 325.239 కోట్ల బిల్లుల కోసం ప్రతిపాదనలు వచ్చాయని.. అందులో హెడ్వర్క్స్ బిల్లు 102.277 కోట్లు, పునరావాసానికి 169.833 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. మిగిలిన మొత్తం ఎస్టాబ్లిష్మెంట్కు సంబంధించినది. కేంద్ర జలశక్తిశాఖ ఇచ్చిన సమాచారం మేరకు.. 2013-14 ధరల ప్రకారం చెల్లించడానికే ఆర్థికశాఖ అంగీకరించింది.