ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 18, 2020, 5:30 AM IST

ETV Bharat / city

ఆస్తులు అమ్మవద్దని తితిదే తీర్మానించింది.. హైకోర్టులో ఈవో కౌంటర్ దాఖలు

తితిదేకు చెందిన భూములు, భవనాలు భవిష్యత్​లో వేలం ద్వారా విక్రయించకూడదని ఈ ఏడాది మే 28న తితిదే తీర్మానం చేసిందని ఈవో అనీల్ కుమార్ సింఘాల్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. తితిదేకు చెందిన అన్ని ఆస్తుల వివరాలతోపాటు, 1974 నుంచి విక్రయించిన ఆస్తులపై శ్వేతపత్రం ప్రచురించాలని బోర్డు తీర్మానించినట్లు కోర్టుకు నివేదించారు.

ttd eo filed counter on assets
ttd eo filed counter on assets

ఆస్తులను తితిదే దుర్వినియోగం చేస్తుందన్న పిటిషనర్ ఆరోపణ సరికాదని.. ఆ వ్యాజ్యాన్ని కొట్టేయాలని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్​ హై కోర్టును కోరారు. తితిదేకు చెందిన తమిళనాడులోని 23 ఆస్తుల వేలాన్ని నిలువరించాలని కోరుతూ భాజపా నేత అమర్నాథ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఈవో కౌంటర్ వేశారు.

'విరాళాలుగా భక్తులు ఇచ్చిన ఆస్తులను ఎందుకు వినియోగించాలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ తితిదేకి ఉంది. 50 ఆస్తుల విక్రయానికి 2016 జనవరి 30న తితిదే బోర్డు చేసిన తీర్మానాన్ని పక్కన పెట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 25న జీవో 888 జారీచేసింది. ప్రపంచవ్యాప్తంగా తితిదేకి స్థిరాస్తులున్నాయని పిటిషనర్ చెబుతున్న దాంట్లో వాస్తవం లేదు. స్వామివారి పేర భక్తులు ఇచ్చిన ప్రతి ఆస్తిలో దేవాలయాలు, ఆశ్రమాలు, పాఠశాలలు, ధ్యానకేంద్రాలు, కల్యాణ మండపాలు నిర్మించడం సాధ్యం కాదు. ఒకవేళ నిర్మించినా.. వాటి నిర్వహణ భవిష్యత్​లో కష్టమవుతుంది. అంతిమంగా ఆ నిర్మాణాలు తితిదేకు తెల్ల ఏనుగులా తయారవుతాయి. నిర్వహణ సాధ్యంకాని ఆస్తులను విక్రయించడానికి గుర్తించారు తప్ప.. పిటిషనర్ ఆరోపిస్తున్నట్లు సొమ్ము చేసుకోవడానికి కాదు. ఆభరణాల భద్రత విషయంలో జస్టిస్ జగన్నాథరావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇదే వ్యవహారంపై మరో కమిటీ అవసరం లేదు. తితిదేకు చెందిన ధనం, బంగారం, ఫిక్స్ డ్ డిపాజిట్ల విషయంలో ఎలాంటి గోప్యత లేదు' అని కౌంటర్​లో ఈవో సింఘాల్​ పేర్కొన్నారు.

ఈవో వేసిన కౌంటర్​పై సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్​కు సమయం ఇస్తూ.. మూడు వారాలకు విచారణ వాయిదా వేసింది ధర్మాసనం.

ఇదీ చదవండి:ధవళేశ్వరం వద్ద గోదారి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

ABOUT THE AUTHOR

...view details