కొవిడ్ 19 కేసుల్లో అధికశాతం వృద్ధులే ఉండటంతో 65 ఏళ్లు పైబడిన వారిని బయటకు రావద్దంటూ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం బిడ్డలు దూరంగా వెళ్లటంతో ఒంటరిగా బతుకెళ్లదీస్తోన్న తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా మారింది. హైదరాబాద్లో వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వయోధికుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ మందడి కృష్ణారెడ్డి ఆందోళన వెలిబుచ్చారు.
ఆకలి.. అనారోగ్యం.. ఒంటరితనం
‘కుమారులు, కుమార్తెలు విదేశాల్లో స్థిరపడ్డారు. భార్యాభర్తలిద్దరూ పింఛనుతో కాలం వెళ్లదీస్తున్నారు. వైద్య సిబ్బంది రావట్లేదు. వంట మనిషిని రావద్దంటూ అపార్ట్మెంట్ సభ్యులు ఆదేశించారు. దీంతో నెలరోజులుగా వృద్ధ దంపతులు అర్ధాకలితో నెట్టుకొస్తున్నారు. ఇటువంటి సమయంలో మరుగుదొడ్డిలో కాలుజారి పడిన భర్తను పైకి లేపేందుకు ప్రయత్నించిన భార్య కూడా స్వల్పంగా గాయపడింది. హైదరాబాద్ మహానగరంలోని 60శాతం వృద్ధులు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో అధికశాతం వృద్ధులు ఆకలి, అనారోగ్యం, ఒంటరితనంతో బాధపడుతున్నట్లు సహాయక కేంద్రాలకు వస్తున్న ఫోన్కాల్స్ ద్వారా అధికారులు లెక్కగడుతున్నారు.
కష్టాలకు కారణాలెన్నో....
గ్రేటర్ పరిధిలో చాలా మంది ఆసరా, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి వచ్చే పింఛన్లపైనే ఆధారపడి ఉన్నట్టు అంచనా. వీరిలో 65 ఏళ్లు పైబడిన వారు 75శాతం వరకు పిల్లలు దూరంగా ఒంటరిగానే ఉంటున్నారు. లాక్డౌన్ పరిస్థితుల్లో పింఛన్ల కోత, నిధుల లేమితో కొన్ని వృద్ధాశ్రమాలు, స్వచ్ఛంద సంస్థలు వారి కడుపు నింపలేకపోతున్నాయి. కొందరికి బిడ్డల నుంచి వచ్చే డబ్బు రావడం లేదు. రీఛార్జి చేసుకునేందుకు బయటికి వెళ్లలేని పరిస్థితుల్లో చాలా మంది వృద్ధుల సెల్ఫోన్లు మూగబోయాయి. ఓ సంస్థ జరిపిన సర్వే ప్రకారం మరణించిన తల్లిదండ్రుల కర్మకాండలు చేస్తున్న పిల్లలు 37శాతమే. మిగిలిన 57 శాతం మంది దూరంగా ఉన్నామనో.. రాలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ పేర్కొంటున్నారు.
పెద్దలకు కొండంత అండగా...