ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 8, 2022, 10:20 PM IST

ETV Bharat / city

తెరాస గులాబీ కూలీ అక్రమాలపై చర్యలెందుకు లేవు.. తెలంగాణ పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy fires on Trs and Bjp: గులాబీ కూలీ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ అక్రమాలపై దిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలున్నా, కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. భాజపా, తెరాస మధ్య ఎలాంటి పంచాయితీలు లేవని.. పశ్చిమ బంగా తరహాలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను రాష్ట్రంలో లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

revanth
revanth

Revanth Reddy fires on Trs and Bjp: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి మరోసారి తనదైన శైలిలో భాజపా, తెరాసలపై విమర్శల వర్షం కురిపించారు. గులాబీ కూలీ పేరున వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపిస్తున్న కేసు నిర్దారణ అయితే తెరాస పార్టీని రద్దు చేయాల్సి వస్తుందని ముందే పసిగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పార్టీ పేరు బీఆర్‌ఎస్‌గా మార్చారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. భాజపా, తెరాస మధ్య వైరుధ్యం ఉన్నట్లు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేసి ఊచలు లెక్కబెట్టిస్తామని భాజపా చెబుతున్న మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రేవంత్ ధ్వజమెత్తారు.

కేసీఆర్‌పై కేంద్రం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. సీబీఐ, ఈడీలు తమను వేధిస్తున్నాయని కేటీఆర్ చెబుతున్నారని.. తెలంగాణలో భాజపా, తెరాస మధ్య యుద్ధ వాతావరణం ఉన్నట్లు అపోహలు కల్పిస్తున్నారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. మోదీ, అమిత్‌ షా, కేంద్రమంత్రులు కేసీఆర్ దోపిడీని ప్రస్తావిస్తున్నా.. అదే వాస్తవమైతే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే గులాబీ కూలీ పేరుతో రాష్ట్రంలో వందలాది కోట్లు వసూళ్లు చేసిన వ్యవహారంపై దిల్లీ హైకోర్టులో తాను సంపూర్ణ వివరాలతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశానని పేర్కొన్నారు. 2018లో కేంద్ర ఎన్నికల సంఘానికి దిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చిందని వివరించారు.

'గులాబీ కూలీ పేరుతో సీఎం కేసీఆర్‌ అక్రమాలకు పాల్పడ్డారు. దిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. కేంద్రప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? భాజపా, తెరాస మధ్య ఎలాంటి పంచాయితీలు లేవు. కాంగ్రెస్‌ను లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారు. భాజపా, తెరాస మధ్య వైరుధ్యం ఉన్నట్లు ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేసి జైలులో వేస్తామని భాజపా చెబుతోంది. సీబీఐ, ఈడీ.. తమను వేధిస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో భాజపా, తెరాస మధ్య యుద్ధ వాతావరణం ఉన్నట్లు అపోహలు కల్పిస్తున్నారు.'-రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

పార్టీ చందాలు వసూలు చేశారని కేసును మూసేశారు..సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు.. నిధులు వసూలు చేయడం నేరమని.. అది లంచం తీసుకోవడంతో సమానమవుతుందని ఏసీబీకి ఫిర్యాదు చేయగా.. పట్టించుకోలేదని రేవంత్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.. పార్టీకి చందాలు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు నివేదించారని ఆరోపించారు. కానీ.. గులాబీ కూలీ పేరున వసూళ్లు చేసిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించలేదని.. రూ.20 వేలకు మించి నగదు రూపంలో వసూలు చేయడం, ఖర్చు పెట్టడం కానీ చేయరాదని చెబుతున్న సీఈసీ నిబంధనలను తెరాస ఉల్లంఘించిందని విమర్శించారు. హైకోర్టులో వేసిన పిల్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి విచారణ చేయాలని ఆదేశాలిచ్చిందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దానిపై ఎన్నికల సంఘం తమ వద్ద సిబ్బంది కొరత ఉందని.. వివరాలు సేకరించేందుకు ఆదాయపు పన్నుశాఖ ఛైర్మన్‌కు అప్పగించగా.. ఇప్పటి వరకు ఎలాంటి విచారణ జరగలేదని రేవంత్ ధ్వజమెత్తారు.

అదే జరిగితే వసూళ్లు చేసిన వ్యవహారంలో చోటు చేసుకున్న అక్రమాలు వెలుగులోకి వస్తాయని.. ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనలూ వెలుగులోకి వస్తాయని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై కేంద్రం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సరైన చర్యలు తీసుకుంటే.. తెరాస పార్టీ రద్దు అవుతుంది.. అందుకే వ్యూహాత్మకంగానే కేసీఆర్ పార్టీ పేరు మారుస్తూ ప్రకటన చేశారని పేర్కొన్నారు. భాజపా సహకారంతో చర్యల నుంచి తప్పించుకుంటున్నారని.. భాజపా, తెరాసలు రాక్షస క్రీడలో భాగమే అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ ప్రకటనల వెనక తెరాస, భాజపా అంతర్గతంగా ఒప్పందం ఉందని ఆయన విమర్శించారు.

revanth

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details