శుద్ధి చేసిన నదీజలాలను ఇంటింటికీ నల్లాల ద్వారా సరఫరా చేస్తున్న పథకం మిషన్ భగీరథ. ఈ ప్రాజెక్టుపై రూ. 33 వేల 400 కోట్లు ఖర్చు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ప్రస్తుతం తెలంగాణలోని 23 వేల 287 ఆవాసాలకు సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తోంది. 124 పట్టణ ప్రాంతాలకు కూడా మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన జలాలను అందిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోని చెంచుగూడేలు, లంబాడి తండాలకు కూడా సోలార్ పంపులు ఏర్పాటు చేసి సురక్షిత నీటిని సరఫరా చేస్తున్నారు. అందుకే కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన నివేదిక ప్రకారం ఇంటింటికీ శుధ్ది చేస్తున్న జలాలను అందించడంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
భగీరథ నీరు సురక్షితమన్న నివేదికలు..
మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న జలాలను పకడ్బందీగా శుద్ధి చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్ధేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జలాల శుద్ధి జరుగుతోంది. ఇందుకోసం నీటిశుద్ధికేంద్రాల వద్ద అత్యున్నత ప్రమాణాలతో కూడిన లేబరేటరీలతో పాటు నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నందుకే మినరల్ వాటర్ కంటె మిషన్ భగీరథ నీరు సురక్షితమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇంజినీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మిషన్ భగీరథ నీరు సురక్షితమని వివిధ సంస్థల నివేదికలు కూడా ఇప్పటికే స్పష్టం చేశాయి.
ప్రయోగాత్మకంగా నిర్వహణ..
వీటన్నింటి నేపథ్యంలో మిషన్ భగీరథ జలాలను బాటిళ్ల రూపంలోనూ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రయోగాత్మకంగా సొంత కార్యాలయాల్లోనే మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన జలాలను బాటిళ్లలో నింపి వినియోగించడాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని మిషన్ భగీరథ కేంద్ర కార్యాలయంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కార్యాలయాల్లో వీటిని వినియోగిస్తున్నారు. మిషన్ భగీరథ నీటిశుద్ధి కేంద్రాల వద్ద శుద్ధి చేసిన జలాలను తీసుకొని బాటిళ్లను నింపుతున్నారు.