ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 30, 2020, 7:37 AM IST

ETV Bharat / city

స్వస్థలాలకు వెళ్లేందుకు.. కేంద్రం మార్గదర్శకాలు

లాక్​డౌన్ కారణంగా ఎక్కడిక్కడ నిలిచిపోయిన వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతినిస్తూ కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

Union Home Ministry has issued guidelines to allow migrant workers
లాక్​డౌన్ పై కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన వలస కార్మికులు, తీర్థ యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లడానికి కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చింది. రవాణా వ్యవస్థ స్తంభించి 35 రోజులుగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నానా ఇబ్బందులు పడుతున్న వీరందర్నీ తగు జాగ్రత్తలతో స్వస్థలాలకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించింది. భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల భుజస్కంధాలపై మోపింది. ఈ మేరకు లాక్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం వలస కార్మికులు తదితరుల తరలింపునకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒక ప్రత్యేక నోడల్‌ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. వారిని పంపడానికి, ఆహ్వానించడానికి ప్రామాణిక విధివిధానాలు రూపొందించాలి. తమ తమ రాష్ట్రాల్లో నిలిచిపోయిన వారి వివరాలను ఈ నోడల్‌ సంస్థ నమోదు చేయాలి.

* నిలిచిపోయిన వ్యక్తులు బృందాలుగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలనుకుంటే వారిని పంపే, స్వీకరించే రాష్ట్రాలు మాట్లాడుకోవాలి. రోడ్డు మార్గం ద్వారా వారిని తరలించడానికి పరస్పరం అంగీకరించాలి.

* తరలించేవారిని ముందుగా స్క్రీనింగ్‌ చేయాలి. కరోనా లక్షణాలు కనిపించని వారినే అనుమతించాలి.

* రవాణాకు బస్సులు ఉపయోగించాలి. వాటిని ముందుగా శానిటైజ్‌ చేయాలి. సీట్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.

* ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస కూలీలు వెళ్లిపోవడానికి మార్గ మధ్యలో ఉన్న రాష్ట్రాలు అవకాశం కల్పించాలి.

* గమ్యస్థానాలు చేరుకున్న తర్వాత వారి ఆరోగ్య పరిస్థితులను స్థానిక వైద్యాధికారులు పరీక్షించాలి. అందర్నీ గృహ నిర్బంధంలో ఉంచాలి.

* అవసరమైనవారినే వ్యవస్థాగత క్వారంటైన్‌కి తరలించాలి. ఇలా వచ్చిన వారందరిపై నిఘా ఉంచాలి. తరచూ వారి ఆరోగ్యాన్ని పరిశీలించాలి.

* ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొనేలా ప్రోత్సహిస్తే దాని ద్వారా ఆరోగ్య పర్యవేక్షణకు వీలవుతుంది.

* ఇళ్లలో క్వారంటైన్‌ కోసం మార్చి 11న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జారీచేసిన నిబంధనలను పాటించాలి.

ఎవరూ తొందరపడొద్దు: కిషన్‌రెడ్డి

లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన వలస కార్మికులు, విద్యార్థులను క్షేమంగా స్వస్థలాలకు తరలించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకొందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలు పరస్పర అంగీకారానికి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుందనీ, ఆలోగా ఎవరూ తొందరపడొద్దని పిలుపునిచ్చారు. ‘‘బస్సుల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటనలు చేస్తాయి. వదంతులను నమ్మి అనవసరంగా శాంతిభద్రతల సమస్యను సృష్టించొద్దు. అందర్నీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ప్రభుత్వం ఉద్దేశం. ఇంకో నాలుగైదు రోజులు ఆలస్యమైనా ఓపిగ్గా ఉండాలి. మీడియాలో ఈ సమస్యకు సంబంధించి ఎక్కువ వార్తలు వచ్చాయి. యంత్రాంగం కంటెయిన్‌మెంట్‌ జోన్లలో పనిచేస్తుంటే, వలస కార్మికుల కారణంగా సమస్య పక్కదారి పట్టేలా ఉందని కేంద్రం గుర్తించింది. అందుకే సమస్యను వేగంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకొంది. కష్టమైనా నష్టమైనా సొంత ఊళ్లకు వెళ్లాలన్న భావోద్వేగంతో కార్మికులున్న విషయాన్ని కేంద్రం గుర్తించింది’’ అని మంత్రి పేర్కొన్నారు.

4 నుంచి లాక్‌డౌన్‌లో సడలింపులు

లాక్‌డౌన్‌పై కొత్త మార్గదర్శకాలు మే 4 నుంచి అమల్లోకి వస్తాయని, అనేక జిల్లాలకు చెప్పుకోదగ్గ సడలింపులు ఉండవచ్చని కేంద్ర హోం శాఖ ట్వీట్‌ చేసింది. వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.

ఇవీ చదవండి....అన్నదాత కంట 'అకాల వర్షం'

ABOUT THE AUTHOR

...view details