అవి దాదాపు రూ.800 కోట్లతో చేపట్టనున్న రహదారుల పనులు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) రుణంతో చేపట్టే ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. వీటిని చేజిక్కించుకోవడానికి కొన్ని గుత్తేదారుల సంస్థలు సిద్ధం చేసుకున్న ముందస్తు వ్యూహం సఫలమైనట్లు కనిపిస్తోంది. అయిదు జిల్లాలకు సంబంధించి నిర్వహించిన టెండర్లలో ఒక్కో జిల్లా నుంచి కేవలం రెండేసి చొప్పున మాత్రమే దాఖలవడం దీనికి నిదర్శనమన్న భావన వ్యక్తమవుతోంది. పైగా తమ కనుసన్నలు దాటి ఎవరైనా టెండర్లు వేస్తారేమోనని కొన్ని సంస్థలు సంబంధిత కార్యాలయాల వద్ద నిఘా పెట్టాయి. ఇతర గుత్తేదారు సంస్థల ప్రతినిధులు వస్తే ఎందుకొచ్చారని ఆరా తీశాయి. చివరకు నిర్ణీత గడువులోగా తమ సంస్థల పత్రాలే దాఖలయ్యేలా చూసుకున్నాయి.
ఇందులోభాగంగానే రాయలసీమకు చెందిన కొందరు వ్యక్తులు విజయవాడలోని సీఈ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ తిష్ఠ వేశారు. టెండర్ల గడువు ముగిసిన తర్వాతే వారు అక్కడి నుంచి వెళ్లారు. జిల్లా మొత్తాన్ని ఒక ప్యాకేజీగా నిర్ణయించి రహదారుల పనులను చేపట్టేందుకు ఈ టెండర్లను పిలిచారు. అనంతపురం జిల్లాలో రూ.128.39 కోట్లు, కడపలో 122.19 కోట్లు, కర్నూలులో రూ.228.82 కోట్లు, చిత్తూరులో రూ.126.15 కోట్లు, ప్రకాశంలో 187.21 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. ఆన్లైన్లో దాఖలుకు శుక్రవారం మధ్యాహ్నం వరకు గడువు ఉండటంతో పలు సంస్థలు బిడ్లు వేశాయి. సాంకేతిక బిడ్లను 14న తెరవనున్నారు.