ఆంధ్రప్రదేశ్

andhra pradesh

OTS SCHEME: రుణం కట్టలేని బడుగులు..ఈ సొమ్ము కట్టగలరా?

నాలుగు దశాబ్దాలుగా గృహనిర్మాణ సంస్థ ద్వారా చేపట్టిన ఇళ్ల నిర్మాణంపై హక్కు కల్పించేందుకని ప్రభుత్వం తెచ్చిన వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పేదలకు భారంగా పరిణమించనుంది. అప్పుడెప్పుడో రుణం పొంది కట్టలేని పరిస్థితుల్లోకి వెళ్లిన బడుగులపై ఈ నిర్ణయం పిడుగులా మారనుంది. దాదాపు 46 లక్షల మంది ఈ జాబితాలో ఉంటారు. ఇళ్ల క్రమబద్ధీకరణ పేరుతో వారినుంచి బకాయిలు రాబట్టేందుకు ఇది ప్రభుత్వ కొత్త వ్యూహమని విమర్శలున్నాయి.

By

Published : Sep 17, 2021, 7:16 AM IST

Published : Sep 17, 2021, 7:16 AM IST

the-ots-scheme-is-a-burden-on-the-poor-people
రుణం కట్టలేని బడుగులు..ఈ సొమ్ము కట్టగలరా?

రాష్ట్రంలో పేదలకు పక్కా గృహాల నిర్మాణాన్ని 1983లో ఎన్టీఆర్‌ ప్రారంభించారు. అప్పట్లో ఒక్కో ఇంటి వ్యయాన్ని రూ.6 వేలుగా నిర్ణయించారు. అందులో సగం రుణం. తర్వాత నిర్మాణ వ్యయం పెరగడంతో ఇంటి రాయితీతో పాటు లబ్ధిదారులు తీసుకునే రుణం కూడా పెరిగింది. పేదల రుణాలను కఠినంగా వసూలు చేయాలని గత ప్రభుత్వాలేవీ భావించలేదు. మధ్యలో వసూలుచేసే ప్రయత్నాలు జరిగినా, విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. ఏటా కొంతమంది లబ్ధిదారులు రుణాలు చెల్లిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం పాత రుణాలన్నింటికీ ఓటీఎస్‌ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అందరూ తీసుకున్న రుణం, వడ్డీ కలిపి రూ.14 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని లెక్కతేల్చారు. కొత్త పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పురపాలక సంఘాల్లో రూ.15 వేలు, నగరపాలక సంస్థల్లో రూ.20 వేలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఇంటిని వేరేవరికైనా అమ్మితే రెట్టింపు వసూలు చేస్తారు. ఇలా రూ.4,500 కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉంది.

వడ్డీని బూచిగా చూపి...

పక్కా ఇళ్ల ప్రారంభం నాటి నుంచి చూస్తే... లబ్ధిదారులు తీసుకున్న రుణం కంటే, వాటిని చెల్లించకపోవడం వల్ల వడ్డీ భారీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం చెబుతోంది. చెల్లించాల్సిన అప్పు చాలా ఉందని, ఓటీఎస్‌ పథకం ద్వారా మేలు జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

చేతులు మారిన ఇంటికి ఎవరు కట్టాలి?

వివిధ కారణాలతో ఇళ్లు అమ్ముకున్నవారు చాలామంది ఉన్నారు. కొంతమంది వారసులకు, ఆడబిడ్డలకు ఇచ్చారు. ఇలా ఎప్పుడో చేతులు మారిన ఇళ్లకు ఓటీఎస్‌ పథకం కింద ఎవరు చెల్లించాలి? కొన్నవాళ్లే కట్టాలని లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చే అవకాశమూ ఉంది. పైగా కొనుగోలు చేసినవారికి ఆ ఇల్లు తప్ప మరో ఇల్లు ఉండకూడదని ప్రభుత్వం చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.

టిడ్కో ఇళ్లు ఉచితమేగా?

టిడ్కో ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన 300 చ.అడుగుల విస్తీర్ణం గల ఇళ్లను ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది. 365 చ.అడుగుల విస్తీర్ణం, 430 చ.అడుగుల విస్తీర్ణం గల ఇళ్లకు లబ్ధిదారులు చెల్లించాల్సిన వాటాలో 50% మినహాయింపును ఇచ్చింది. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకంలో 30లక్షల మందికి ఇచ్చిన స్థలాలు, వాటిలో కట్టే ఇళ్లనూ ఉచితంగానే ఇస్తోంది. ఇంత భారం మోస్తున్న ప్రభుత్వం.. ఎప్పుడో ఇల్లు కట్టుకుని రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నవారి నుంచి రూ.4,500 కోట్లు రాబట్టేందుకు ప్రయత్నించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి:SEC: ఈనెల 19న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు

ABOUT THE AUTHOR

...view details