National Crime Statistics Report ఆంధ్రప్రదేశ్లో 2020తో పోలిస్తే 2021లో ఎస్సీలపై నేరాలు 3.28 శాతం, ఎస్టీలపై నేరాలు 12.81 శాతం పెరిగాయి. గతేడాది దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో 3.95, ఎస్టీలపై చోటుచేసుకున్న నేరాల్లో 4.10 శాతం ఏపీలోనే నమోదయ్యాయి. దళితులు, గిరిజనులపై అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది. 2020లో 8వ స్థానంలో ఉండేది. వారిపై నేరాలు పెరగటంతో ఈ విషయంలో పైకి ఎగబాకింది.
* ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలపై నేరాల రేటు (13.7 శాతం) జాతీయ స్థాయి (8.4 శాతం) కంటే చాలా ఎక్కువగా ఉంది. దేశంలో ప్రతి లక్ష మంది ఎస్టీ జనాభాకు 8.4 నేరాలు జరుగుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 13.7 నేరాలు జరుగుతున్నాయి. ఎస్టీలపై నేరాల రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ అయిదో స్థానంలో ఉంది.
* రాష్ట్రంలో ప్రతి లక్ష మంది ఎస్సీ జనాభాకు 23.8 నేరాలు జరుగుతున్నాయి. ఈ నేరాల రేటూ ఎక్కువే ఉంది.
మహిళల ఆత్మగౌరవానికి భరోసా ఏదీ?:మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోనే చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా గతేడాది ఇలాంటి ఘటనలపై 7,788 కేసులు నమోదవగా.. అందులో 2,370 (30.43%) ఆంధ్రప్రదేశ్లోనే చోటుచేసుకోవడం గమనార్హం.
* పని చేసే చోట, ప్రజారవాణాలో ఈ తరహా వేధింపులు అధికంగా జరుగుతున్నాయి. 2020లో ఈ తరహా ఘటనలపై ఏపీలో 2,342 కేసులు నమోదవగా.. గతేడాది ఆ సంఖ్య 2,370కు పెరిగింది.
భారీగా పెరిగిన హత్యలు, అత్యాచారాలు, అపహరణలు..
* ఆంధ్రప్రదేశ్లో హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగాయి. 2020లో 853 హత్యలు జరగ్గా.. 2021లో 956 చోటుచేసుకున్నాయి. అంతకు ముందు ఏడాది కంటే ఏకంగా 103 హత్యలు ఎక్కువగా జరిగాయి. హత్యల్లో పెరుగుదల 12.07 శాతం.
* మహిళలపై అత్యాచార ఘటనలూ ఎక్కువయ్యాయి. 2020లో 1095 అత్యాచార ఘటనలు జరగ్గా.. 2021లో 1,188 ఘటనలు చోటుచేసుకున్నాయి. అంతకు ముందు ఏడాది కంటే 93 కేసులు అధికంగా నమోదయ్యాయి. అత్యాచారాలు 8.49 శాతం పెరిగాయి. వీటిలో అత్యధిక శాతం నిందితులు బాధితులకు బాగా పరిచయస్తులే కావడం గమనార్హం.