అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్దేశించిన ప్రమాణాలు పాటించాలంటే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సు మేరకు ఫీజులు పెంచాలని కళాశాలలు డిమాండ్ చేస్తున్నాయి. కమిషన్ మాత్రం ఆదాయ, వ్యయాల ప్రకారమే ఫీజులు నిర్ణయిస్తామంటోంది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కనీస ఫీజుతోపాటు గరిష్ఠంగా నగరాల్లో రూ.1.50 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.1.49 లక్షలు ఉండాలని సూచించింది. యాజమాన్య కోటా కేటగిరి-బీ కింద గరిష్ఠ ఫీజుపై మూడింతలు వసూలు చేసుకునే అవకాశం ఇవ్వాలంది. ఎన్ఆర్ఐ, విదేశీయులకూ ఇదే ఫీజును అమలు చేయాలని సూచించింది. ఆన్లైన్ విద్యకు క్రెడిట్కు రూ.2,500 చొప్పున తీసుకోవాలని సూచించింది. వీటిపై ఈ నెల 28లోపు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ అభిప్రాయం కోరింది.
పెంపుపై చాలాకాలంగా డిమాండ్లు
రాష్ట్రాలు నిర్ణయిస్తున్న ఫీజులు అసమంజసంగా ఉన్నాయని దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నాయి. కనీస రుసుములు నిర్ణయించాలనే దానిపై గతేడాది సెల్ఫ్ ఫైనాన్స్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సుల ప్రకారం సిబ్బందికి వేతనాలు, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఆ మొత్తం కంటే ఎక్కువే ఉండాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏఐసీటీఈ సైతం సాంకేతిక విద్యలో నాణ్యత తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కనీస రుసుమును నిర్ణయించింది. కనీస రుసుములను అమలు చేస్తూ మూడేళ్లు సమయం ఇవ్వాలని, అప్పటికీ కళాశాలల నాణ్యత మెరుగుపడకపోతే మూసివేయాలని పేర్కొంది.
రెండింతలకు పైగా భారం
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు అమల్లోకి వస్తే ఇంజినీరింగ్కు కనీస రుసుములతో పాటు పీజీ కోర్సులకు ఫీజులు భారీగా పెరుగుతాయి. రాష్ట్రంలో ఇంజినీరింగ్కు ప్రస్తుతం గరిష్ఠ రుసుము రూ.70 వేలు. ఆంధ్రప్రదేశ్లో 258 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. వీటిలో 70 కళాశాలల్లో వార్షిక రుసుము రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు, మరో 22 చోట్ల రూ.65 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంది. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బోధన రుసుములు చెల్లిస్తోంది. దీనికి ఏటా రూ.2,100 కోట్ల వరకు వ్యయమవుతోంది. ఇందులో సాధారణ డిగ్రీలను మినహాయిస్తే రూ.1,400 కోట్లకు పైగా సాంకేతిక విద్యకు చెల్లింపులు ఉన్నాయి. కనిష్ఠ ఫీజు రూ.75 వేలు అమలు చేయాల్సి వస్తే ఇంజినీరింగ్కే రూ.3 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ప్రభుత్వం ప్రైవేటులో పీజీ కోర్సులకు బోధన రుసుములు చెల్లించడం లేదు. కాబట్టి వాటిలో పెరిగే ఫీజులు విద్యార్థులకు భారమవుతాయి.