తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై విచారణ జరిపిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ నిర్ణయాన్ని వెల్లడించింది. ఏపీ స్థానికత ఉన్న వారిలో 613 మంది ఉద్యోగులను ఏపీలో చేర్చుకోవాలని.. మిగతా 544 మందిని తెలంగాణలో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
విద్యుత్ ఉద్యోగుల విభజన..జస్టిస్ ధర్మాధికారి కమిటీ కీలక ఆదేశాలు - division of power employees
విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదాన్ని తేలుస్తూ జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ స్థానికత ఉన్న 1157 మంది ఉద్యోగుల్లో 544 మందిని తెలంగాణలోనే కొనసాగించాలని పేర్కొంది. ఏపీకి వెళ్తామని ఆప్షన్ ఇచ్చిన 613 మంది ఉద్యోగులు ఏపీలో చేర్చుకోవాలని తెలిపింది. ఏపీలో ఖాళీలు లేకపోతే.. సూపర్ న్యుమరరీ పోస్టులు సృష్టించాలని స్పష్టం చేసింది.
![విద్యుత్ ఉద్యోగుల విభజన..జస్టిస్ ధర్మాధికారి కమిటీ కీలక ఆదేశాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4662488-474-4662488-1570286284927.jpg)
అసలు వివాదం ఇదే!
రాష్ట్ర విభజన అనంతరం ఏపీ స్థానికత గల 1157మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీకి బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సర్కారును పలువురు ఉద్యోగులు వ్యతిరేకరించారు. మరోవైపు తమ వద్ద ఖాళీలు లేవని వారందరినీ చేర్చుకోలేమని ఏపీ ప్రభుత్వం కూడా పేర్కొంది. ఈ పరిణామాలతో విభజన అంశం వివాదంగా మారి సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. అందరితో చర్చించి పరిష్కారాన్ని సూచించేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలోని కమిటీని సుప్రీంకోర్టు నియమించింది.
మరోసారి విచారణ
కొంతకాలంగా వివిధ అంశాలను పరిశీలించిన ధర్మాధికారి కమిటీ... నిన్న, ఇవాళ హైదరాబాద్లో రెండు రాష్ట్రాల విద్యుత్ అధికారులతో చర్చించింది. విభజన వివాదం సుదీర్ఘ కాలంగా తేలకపోవటంతో ఉద్యోగుల్లో అసహనం పెరిగిపోతోందని కమిటీ అభిప్రాయపడింది. కాబట్టి ఏపీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న 613 మందిని ఏపీలో చేర్చుకోవాలని, ఖాళీలు లేకపోతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాలని స్పష్టం చేసింది. మిగతా వారిని తెలంగాణలో కొనసాగించాలని పేర్కొంది. ప్రస్తుతం ఏపీలో పని చేస్తున్న మరో 265 మంది ఉద్యోగులు తెలంగాణకు వెళ్తామంటున్న విషయాన్ని కూడా పరిశీలించాలని ధర్మాధికారి కమిటీ నిర్ణయించింది. వాటికి సంబంధించిన వివరాలన్నీ తమకు సమర్పించాలని రెండు రాష్ట్రాల అధికారులను ఆదేశించింది. వచ్చే నెల 2, 3 తేదీల్లో విజయవాడలో సమావేశమై విచారణ జరపనుంది.