ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల అక్రమాలపై చర్యలు తీసుకోండి: ఎస్‌ఈసీకి హైకోర్టు‌ ఆదేశం - High Court directed the SEC to take appropriate action on election irregularitie

రాష్ట్రంలో ఎన్నికల అక్రమాలపై స్పందించాలని, అన్ని అధికారాలను వినియోగించి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్​ఈసీ ని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అధికారపార్టీ నేతలు అడ్డుకోవడం, బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై దాఖలైన వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు.... వాటిని సరైన దృష్టి కోణంతో చూడాలని స్పష్టం చేసింది. ఎస్​ఈసీ అధికారాన్ని వినియోగించి నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించి రాజ్యాంగ లక్ష్యాన్ని సాధించాలని పేర్కొంది. పిటిషనర్లు లేవనెత్తిన ఆరోపణలు ఒకవేళ నిజమైతే... అవి తీవ్రమైనవని పేర్కొంది.

The High Court directed the SEC to take appropriate action on election irregularities in elections
ఎన్నికల అక్రమాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీకి హైకోర్టు‌ ఆదేశం

By

Published : Feb 13, 2021, 3:37 AM IST

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో అధికారపార్టీ మద్దతుదారులు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నా..... నిలువరించడంలో ఎస్​ఈసీ , జిల్లా కలెక్టర్ విఫలమయ్యారంటూ ఆ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం నాయకురాలు అనీషారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోనూ అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని... మాజీ ఎమ్మెల్యే శంకర్ కోర్టును ఆశ్రయించారు. గుంటూరు జిల్లా మాచర్ల పరిధిలోని గ్రామాల్లోనూ బలవంతపు ఏకగ్రీవాలపై మరికొన్ని పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటన్నింటినీ హైకోర్టు విచారించింది. సీనియర్ న్యాయవాది పి. వీరారెడ్డి పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని... పలుచోట్ల నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. అతికష్టం మీద నామినేషన్ వేసినా..... తర్వాత ఏదో కారణంతో వాటిని తిరస్కరిస్తున్నారని న్యాయస్థానానికి విన్నవించారు. తిరస్కరణకు గురైనట్లు ఉత్తర్వులివ్వాలని కోరినా... ఇవ్వడం లేదన్నారు. ఈ వ్యవహారంపై ఎస్​ఈసీ కి ఫిర్యాదులు అందినా ఫలితం లేదని వాదించారు. ఎన్నికల సమయంలో యంత్రాంగం అంతా ఎస్​ఈసీ పర్యవేక్షణలో ఉన్నా..... చర్యలు లేవన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఎస్​ఈసీ పై ఉందన్నారు. కేవలం నోటిఫికేషన్ ఇచ్చి …. బాధ్యత తీరిపోయిందనుకుంటే కుదరదన్నారు. ప్రకటన ఇచ్చిన నాటి నుంచి ఫలితాల వెల్లడి వరకు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. 5 మండలాల్లో... 85 పంచాయతీల్లో ఎనభై రెండింటిని ఏకగ్రీవం చేసుకుంటున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ అంశాలను పరిశీలించి తగిన ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.

ఎస్​ఈసీ తరపున వాదించిన న్యాయవాది అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ , ఎస్పీలకు పంపి చర్యలకు ఆదేశిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయని కోర్టు దృష్టికి తెచ్చారు. అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్టు ఫిర్యాదు చేస్తే తగిన విధంగా స్పందిస్తామన్నారు. అనంతరం జోక్యం చేసుకున్న ప్రభుత్వ న్యాయవాది వ్యాజ్యానికి విచారణార్హత లేదని వాదించారు. నామినేషన్లు వేయడానికి ఇబ్బందులు ఎదుర్కొన్న వారు కోర్టుకు రావాలే తప్ప వారందరి తరఫున పిటిషనర్ వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదన్నారు.

అభ్యర్థులను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకుంటున్నారని మరికొన్ని చోట్ల బలవంతంగా ఉపసంహరింపచేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నట్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవని చెప్పడంలో సందేహం లేదని పేర్కొంది. ఆ ఆరోపణలు ఒకవేళ నిజమైతే అవి తీవ్రమైనవిగా భావించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. నిష్పాక్షిక ఎన్నికలనేవి ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి పునాది. స్వేచ్చాయుతంగా అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఎన్నికల్లో పోటీచేయడం, భయాందోళన, బెదిరింపులకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోగలిగే ఎన్నికలే ప్రజాస్వామ్య పితామహులు ఆకాంక్ష అని పేర్కొంది. ఈ తరహా ఎన్నికలు ప్రతిస్థాయిలో జరగాలని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలోనే నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించేందుకు, తగిన విధంగా వ్యవహరించేందుకు ఎస్​ఈసీ కి విస్తృతాధికారాల్ని ఇచ్చారని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్ మొత్తం అధికారానికి కేంద్రబిందువుగా సుప్రీంకోర్టు పేర్కొందని తెలిపింది. పిటిషన్లలో ఉత్పన్నమైన అంశాలపై వెంటనే దృష్టిసారించి ...అన్ని అధికారాలను వినియోగించి , ఎప్పటికప్పుడు యంత్రాంగానికి తగిన ఆజ్ఞలు జారీచేయాలని ఎస్​ఈసీ ని ధర్మాసనం ఆదేశించింది. పిటిషనర్లు సమర్పించిన ఫిర్యాదులు , వినతులను పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఉక్కు కవచాలైన బ్యూరోక్రసీ పోలీసులు , రెవెన్యూ , ఇతర అధికారులు విధినిర్వహణలో ఎస్​ఈసీ కి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నామని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు వ్యాజ్యంపై తదుపరి విచారణను మార్చి 5 కు వాయిదా వేసింది.

ఇదీచదవండి.

నేడు రాష్ట్రంలో రెండోదశ పంచాయతీ ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details