ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా.. యాదాద్రికి హరితశోభ..! - తెలంగాణ వార్తలు

తెలంగాణలోని దివ్యక్షేత్రం యాదాద్రిని హరితమయంగా మార్చేందుకు యాడా ముమ్మరంగా కృషి చేస్తోంది. గ్రామీణ వాతావరణం నెలకొల్పేలా అధికారులు చర్యలు చేపట్టారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో క్షేత్ర పరిసరాల్లో వివిధ రకాల పండ్లు, పూల మొక్కలను నాటుతున్నారు.

The greenery of Yadadri
యాదాద్రికి హరితశోభ

By

Published : Jun 29, 2021, 12:26 PM IST

తెలంగాణ తిరుపతి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో సహజ సిద్ధమైన కొండ ప్రాంగణాలతో పాటు పచ్చదనంతో కూడిన పల్లెటూరి వాతావరణం నెలకొల్పేలా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మన సంస్కృతిని చాటే కలశ రూపం అదనపు ఆకర్షణగా మారింది. కొండపై ప్రాంగణాన్ని ఆధ్యాత్మికంగా రూపొందిస్తున్నారు. కొండకింద ఆలయ పరిసరాలను గ్రామీణ వాతావరణం ప్రస్ఫుటమయ్యేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుసార్లు దిశానిర్దేశం చేశారు.

హరితమయం

సీఎం ఆదేశాలతో కొండకింద ఉత్తరదిశలోని ప్రెసిడెన్షియల్ సూట్ల వద్ద వలయదారి ప్రాంగణంలో ఈత, కొబ్బరి, పొన్న, నాగవళి చెట్ల పోషణకు 15 రోజుల క్రితం శ్రీకారం చుట్టారు. ఆధ్యాత్మికత, ఆహ్లాదాన్ని కలిగించే తరహాలో హరితమయంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేపట్టారు. క్షేత్ర సందర్శనకు వచ్చే వీవీఐపీలు బస చేసే ప్రెసిడెన్షియల్ సూట్ల వద్ద ఎక్కడా లేని విధంగా మొక్కలను పూజలో వినియోగించే "కలశం" ఆకారంలో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు.

సంస్కృతి ఉట్టిపడేలా..

గిరి ప్రదక్షిణ దారిలోనూ ఏపీ నుంచి తెప్పించిన వివిధ మొక్కలను పెంచుతున్నారు. ముఖ్యమంత్రి సూచనలతో చేపట్టిన ఈ పనుల తీరుపై సీఎంవో భూపాల్ రెడ్డి ఎప్పటికపుడు సమాచారం సేకరిస్తున్నారు. ఈ క్షేత్ర సందర్శన కోసం వచ్చే దేశ, విదేశీయులకు ఆధ్యాత్మిక ఆహ్లాదంతో సహా మన సంస్కృతిని చాటేలా కొండకింద గండి చెరువు పరిసరాలు, వలయదారి, గిరి ప్రదక్షిణ దారులు పచ్చగా మార్చేందుకు కసరత్తులు ముమ్మరమయ్యాయి.

సీఎం ప్రత్యేక దృష్టి

హరిహరుల ఆలయాల పునర్నిర్మాణం పనులు పూర్తి కావొస్తున్నందున ఉద్ఘాటనపై ముఖ్యమంత్రి దృష్టిసారించారు. ఆ దిశలో 15వ సారి ఈ క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ నిర్మాణాలు, ఉద్ఘాటనపై కీలక నిర్ణయానికి రానున్నట్లు ‘యాడా’ భావిస్తోంది. క్షేత్రాభివృద్ధి కోసం ఇప్పటివరకు రూ.840 కోట్లు ఖర్చు కాగా, కొండపై పునర్నిర్మితమైన పంచనారసింహుల సన్నిధి, పర్వతవర్ధిని సహిత రామలింగేశ్వరస్వామి(శివాలయం) ఆలయాలకు రూ.240 కోట్ల ఖర్చయినట్లు యాడా వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావు తెలిపారు.

వివిధ రకాల మొక్కల పెంపకం

కృష్ణశిలలతో...

పూర్తిస్థాయిలో కృష్ణశిలతో ప్రధాన ఆలయ పునర్నిర్మించారు. అష్టభుజ మండప ప్రాకారాలు, రాజగోపురాలు, దివ్య విమానం, ఆళ్వారుల మండపం అద్భుతంగా నిర్మించారు. గర్భగుడి మహాద్వారంపై ప్రహ్లాద చరిత్ర, భక్తాగ్రేసరుల విగ్రహ రూపాలు ఈ క్షేత్ర విశిష్టతను నలుదిశలా చాటనున్నాయి.

యాదాద్రి, శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయం

ఇదీ చదవండి:

CORONA EFFECT: కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన కొయ్యబొమ్మల కళాకారులు

ఈ టిప్స్​తో మీ డిజిటల్​ పేమెంట్స్ సేఫ్​!

ABOUT THE AUTHOR

...view details