Industrial parks: తెలంగాణలోని కొత్త పారిశ్రామిక పార్కుల్లో టౌన్షిప్ల నిర్మాణ పనులు ముందుకు సాగక కార్మికులు అగచాట్లు పడుతున్నారు. పారిశ్రామిక వాడల్లోగానీ, వాటికి సమీపాల్లో గానీ నివాస వసతి లేక దూరప్రాంతాల్లో ఉంటూ వ్యయప్రయాసలకోర్చి పనులకు రావాల్సి వస్తోంది. రాష్ట్రంలో 156 పారిశ్రామిక పార్కులున్నాయి. ఇందులో 16 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. త్వరలో మరో 12 ప్రారంభం కానున్నాయి. నైపుణ్యం ఉన్నవారితో పాటు లేని వారికి సైతం పనులు దొరుకుతున్నందున పెద్ద సంఖ్యలో కార్మికులు పనుల్లో చేరుతున్నారు. ఇంకా నాలుగులక్షల మందికి పైగా కార్మికుల అవసరం ఉందని పరిశ్రమల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో పరిశ్రమల ఏర్పాటును నిషేధించింది. నగరానికి దూరంగా 26 కొత్తగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసింది. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. పారిశ్రామిక పార్కుల కోసం రహదారులను నిర్మించింది. వాటిల్లో నీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతులను కల్పించింది. కార్మికుల వసతులకు మాత్రం ఇబ్బందులున్నాయి. పారిశ్రామిక పార్కులకు రవాణా వసతి లేదు. బస్సులు, ఆటోలు వెళ్లడం లేదు. దీంతో కార్మికులు దూరంగా ఉన్న బస్స్టాప్ల వద్ద, ఆటో స్టాండ్ల వద్ద దిగి పరిశ్రమలకు వస్తున్నారు.
ముందుకెళ్లని ప్రతిపాదనలు:కొత్త పారిశ్రామికపార్కుల ఏర్పాటు సందర్భంగా కార్మికులకు నివాస వసతి గురించి పరిశ్రమల సంఘాలు, యాజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వీటిపై స్పందించి... పారిశ్రామికపార్కుల వద్ద టౌన్షిప్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమీకృత టౌన్షిప్ విధానంలో దీనిని చేర్చారు. దీనికి అనుగుణంగా ఎక్కువ విస్తీర్ణం గల పారిశ్రామిక పార్కుల్లో కొంత స్థలాన్ని టౌన్షిప్ల కోసం ఏర్పాటు చేసి ఇళ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. తక్కువ విస్తీర్ణం గల ప్రాంతాల్లో కార్మికులకు కనీస వసతులతో కూడిన డార్మెటరీ తరహా గదులను నిర్మించాలని భావించారు. దీనిలో భాగంగా కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మాదాపూర్, వరంగల్లలో పారిశ్రామిక టౌన్షిప్ల ఏర్పాటు, దండుమల్కాపూర్లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కులోనూ టౌన్షిప్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభం కాలేదు.
దండుమల్కాపూర్ పారిశ్రామిక పార్కులోని పరిశ్రమలో శ్రీనివాస్ కార్మికుడు. అక్కడికి 45 కిలోమీటర్ల దూరం నుంచి రోజూ అక్కడికి వస్తూ, పోతున్నారు. పార్క్కు సమీపంలో ఉండడానికి ఇళ్లు లేకపోవడంతో రోజూ రాకపోకలకు ఇబ్బంది అవుతోందని తెలిపారు.