ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 9, 2020, 12:15 PM IST

ETV Bharat / city

మరో రూ.2వేల కోట్ల రుణం

బహిరంగ మార్కెట్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.2వేల కోట్ల రుణం‌ సమీకరించింది. వేలంలో పాల్గొన్న అన్ని రాష్ట్రాల కన్నా ఏపీపైనే అధిక వడ్డీ పడింది.

The Andhra Pradesh government on Tuesday raised another Rs 2,000 crore in debt from the open market
మరో రూ.2వేల కోట్ల రుణం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ నుంచి మంగళవారం మరో రూ.2వేల కోట్ల రుణాన్ని సేకరించింది. దీంతో ఈ నెలలో ఇప్పటివరకు రూ.5వేల కోట్ల అప్పు తీసుకున్నట్లయింది. ఆర్‌బీఐలో మంగళవారం జరిగిన ‘రాష్ట్ర అభివృద్ధి రుణాల’ వేలం ద్వారా 16ఏళ్లకు రూ.వెయ్యి కోట్లు, 18 ఏళ్లకు మరో వెయ్యి కోట్ల చొప్పున సేకరించింది. మొత్తం 13 రాష్ట్రాలు రూ.14,175 కోట్ల రుణం కోసం నోటిఫై చేయగా రూ.15,675 కోట్లను సమీకరించాయి.

హరియాణా, మహారాష్ట్ర అదనంగా తీసుకున్నాయి. 20 ఏళ్ల కాలపరిమితితో పశ్చిమబెంగాల్‌పై 6.77%, 14 ఏళ్లకు కర్ణాటకపై 6.77%, 13 ఏళ్లకు మధ్యప్రదేశ్‌పై 6.79% వడ్డీ భారం పడింది. అదే ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం 16 ఏళ్ల రుణంపై 6.85%, 18 ఏళ్ల రుణంపై 6.87% వడ్డీ నమోదైంది. అన్ని రాష్ట్రాల కన్నా ఏపీపైనే ఎక్కువ వడ్డీ పడింది. ఇటీవల తీసుకున్న రూ.3వేల కోట్లలో 4ఏళ్లకు వెయ్యి కోట్లపై కేవలం 5.52% వడ్డీ పడగా... 15, 19 ఏళ్లకు 6.68% వడ్డీతో వెయ్యి కోట్ల చొప్పున రుణం తీసుకుంది.

రుణాల తిరిగి చెల్లింపు భారాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవడానికి ఎక్కువ కాలానికి వెళ్తున్న రాష్ట్రాలు, అవసరాల మేరకు రుణాన్ని సేకరించాల్సిన రాష్ట్రాలు అధిక వడ్డీ మోయాల్సి వస్తోంది. చాలా రాష్ట్రాలు ఆర్‌బీఐ నుంచి 10 ఏళ్లకే రుణాన్ని సేకరిస్తున్నాయి. అవసరం ఉన్న రాష్ట్రాలు ఎక్కువ కాలపరిమితిని ఎంచుకుంటున్నాయి. సెప్టెంబర్‌ 1న జరిగిన వేలంలో పాల్గొన్న 10 రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాలు పదేళ్లకే వెళ్లాయి. ఆ వేలంలో తెలంగాణ 30 ఏళ్లకు 6.71% వడ్డీతో రూ.1,500 కోట్లు, రాజస్థాన్‌ 20 ఏళ్లకు 6.70% వడ్డీతో రూ.1,210 కోట్లను సమీకరించాయి. మంగళవారం వేలంలో 5రాష్ట్రాలు 10 ఏళ్ల కాలానికి, 4 రాష్ట్రాలు 13 నుంచి 20 ఏళ్లకు, ఛత్తీస్‌గఢ్‌, పుదుచ్చేరిలు 3 ఏళ్ల కాలవ్యవధితో రుణాలను తీసుకున్నాయి.

ఇదీ చదవండి:అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటివారినైనా విడిచిపెట్టొదు: సీఎం

ABOUT THE AUTHOR

...view details