ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Chalo Thadepalli: 'అవరోధాలు ఎదురైనా.. ఆంక్షలు విధించినా.. ముందుకే' - chalo thadepalli latest news

విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు నేడు సీఎం ఇంటి ముట్టడికి తలపెట్టిన చలో తాడేపల్లి కార్యక్రమంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. నెలరోజులుగా చేస్తున్న ఉద్యమాన్ని.. అక్రమ అరెస్టులతో ఆపలేరని.. సీఎం నివాసాన్ని ముట్టడించి తీరతామని టీఎన్​ఎస్ఎఫ్ ఆధ్వర్యంలోని నిరుద్యోగ యువత స్పష్టం చేసింది. అదే సమయంలో తాడేపల్లి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

చలో తాడేపల్లి
చలో తాడేపల్లి

By

Published : Jul 19, 2021, 8:37 AM IST

చలో తాడేపల్లి కార్యక్రమం..

ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎలాంటి ఆంక్షలు విధించినా.. చలో తాడేపల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని.. విద్యార్థి సంఘాలు తేల్చిచెప్పాయి. చలో తాడేపల్లి కార్యక్రమానికి వెళ్తుతున్న కడప జిల్లా విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతపురం జిల్లాలో విద్యార్థి, యువజన సంఘాల నేతల్ని ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. చలో తాడేపల్లి కార్యక్రమానికి బయలుదేరిన తెదేపా యువనేత జేసీ పవన్‌రెడ్డిని.. అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తెదేపా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చంద్ర దండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్‌ నాయుడును బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.ఉద్యోగాల కోసం ఉద్యమ బాట పట్టిన విద్యార్థులపై పోలీసుల వైఖరి ఎమర్జెన్సీని తలపిస్తోందని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.

కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్..

చలో తాడేపల్లి కార్యక్రమానికి బయలుదేరిన తెలుగు యువత, తెలుగు విద్యార్థి నాయకులను నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాల భర్తీలో కోతలు విధిస్తూ సీఎం నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని తెదేపా కార్యనిర్వహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ధ్వజమెత్తారు. చలో తాడేపల్లి కార్యక్రమంలో పాల్గొనటానికి వస్తున్న తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, విద్యార్థి సంఘాల నాయకుల అక్రమ అరెస్టులపై తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు మండిపడ్డారు. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని నిలువరించేందుకు గుంటూరు ఆర్బన్‌ ఎస్పీ ఆరీఫ్ ఆఫీజ్‌ ఆధ్వర్యంలో అదనపు ఎస్పీ ఈశ్వరరావు పర్యవేక్షణలో తాడేపల్లిలో 500 మంది పోలీస్‌ సిబ్బందితో పహారా కొనసాగుతోంది. తాడేపల్లి, పరిసర గ్రామాల్లో చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు. కనకదుర్గమ్మ వారథి, సీతానగరం ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రత్యేక బలగాల్ని మోహరించారు. ఉదయం 10 గంటలకు సీఎం జగన్ పోలవరం సందర్శనకు బయలుదేరి వెళ్లనున్న నేపథ్యంలో ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం నివాసాన్ని ముట్టడించి తీరుతామని విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

నాపై వైకాపా నేతల హత్యాయత్నం.. కోర్టులో తేల్చుకుంటా: తెదేపా కార్యకర్త మణిరత్నం

కేంద్ర మంత్రులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్​?

ABOUT THE AUTHOR

...view details