swachh survekshan awards 2021 : ‘సఫాయి మిత్ర సురక్ష’లో తెలంగాణకు రెండో స్థానం - తెలంగాణ వార్తలు
స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ర్యాంకుల్లో(swachh survekshan 2021 awards) తెలంగాణ సత్తా చాటింది. ‘సఫాయి మిత్ర సురక్ష’లో తెలంగాణకు రెండో స్థానం.. నగరాల్లో కరీంనగర్కు 2వ ర్యాంకు దక్కింది. ఉత్తమ సుస్థిర పట్టణంగా సిద్దిపేట నిలిచింది. దక్షిణాది జోన్లో పరిశుభ్ర పురపాలికగా సిరిసిల్లకు గుర్తింపు వచ్చింది.
‘సఫాయి మిత్ర సురక్ష’లో తెలంగాణకు రెండో స్థానం
By
Published : Nov 21, 2021, 9:16 AM IST
స్వచ్ఛ సర్వేక్షణ్-2021(swachh survekshan 2021 awards) ర్యాంకుల్లో తెలంగాణ మెరిసింది. 40 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో ‘స్వయం సమృద్ధ’ (సెల్ఫ్ సస్టైన్బుల్) మెగా నగరంగా గ్రేటర్ హైదరాబాద్ నిలిచింది. ‘సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్’ ర్యాంకుల్లో తెలంగాణకు రెండో ర్యాంక్ దక్కగా ఇదే విభాగంలో 3 లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల్లో కరీంనగర్ జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ రాష్ట్రాల ర్యాంకుల్లో గతేడాది 18వ స్థానంలో ఉన్న తెలంగాణకు ఈసారి 11వ ర్యాంకు దక్కింది. 10 పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో హైదరాబాద్ 13వ స్థానంలో నిలిచింది.
లక్ష నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో కరీంనగర్ 74, రామగుండం 92 స్థానాల్లో నిలిచాయి. జిల్లా ర్యాంకుల్లో హైదరాబాద్ జిల్లా 6, సిరిసిల్ల 80, పెద్దపల్లి 117, కరీంనగర్ 139వ ర్యాంకు సాధించాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ శనివారం ఈ ర్యాంకులను(telangana swachh survekshan awards) విడుదల చేసింది. దిల్లీ విజ్ఞాన్ భవన్లో అవార్డులను ప్రదానం చేసింది. పౌరసేవల పురోగతిలో ఛత్తీస్గఢ్ దేశంలో మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 7, తెలంగాణ 8 స్థానాల్లో నిలిచాయి. కంటోన్మెంట్ల ర్యాంకింగ్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్కు ఏడో ర్యాంకు సాధించింది. 100కుపైగా పట్టణ పాలక సంస్థలున్న రాష్ట్రాల్లో తెలంగాణకు పదో ర్యాంకు దక్కింది.
వివిధ విభాగాల్లో ర్యాంకులు ఇలా..
‘స్వచ్ఛ సర్వేక్షణ్’ నగరాల ర్యాంకుల్లో జాతీయస్థాయిలో(cleanest city in india 2021) ఇండోర్ ప్రథమ స్థానంలో నిలవగా, సూరత్ ద్వితీయ, విజయవాడ తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఈ విభాగంలో విశాఖపట్నానికి 9వ ర్యాంకు దక్కింది. గ్రేటర్ హైదరాబాద్ (13వ ర్యాంకు) అవార్డును ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ చేతులమీదుగా పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ అందుకున్నారు.
‘సఫాయిమిత్ర సురక్ష’ విభాగంలో ద్వితీయ స్థానంలో కరీంనగర్ నిలిచింది. ఈ అవార్డును భూపేష్ బఘేల్ చేతులమీదుగా కరీంనగర్ మేయర్ వై.సునీల్రావు, కమిషనర్ యాదగిరిరావు అందుకున్నారు. ఈ అవార్డు కింద కరీంనగర్కు రూ.4 కోట్ల చెక్కును అందజేశారు.
‘ప్రేరక్ దౌర్ సమ్మాన్’ అవార్డులు
వ్యర్థాల్లో తడి, పొడి, ప్రమాదకరమైనవి విభజించడం.. వేర్వేరుగా శుద్ధి చేసి రీసైక్లింగ్ చేయడం.. నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను వేరుచేయడం, నగరాల్లో పారిశుద్ధ్య పరిస్థితుల ఆధారంగా ‘ప్రేరక్ దౌర్ సమ్మాన్’ పేరిట ఈ దఫా అవార్డులు(telangana awards) ఇచ్చారు. ఇందులో ప్లాటినం, గోల్డ్, బ్రాంజ్, కాపర్ విభాగాల్లో రాష్ట్రంలోని పలు పురపాలికలు అవార్డులు సాధించాయి.
గోల్డ్ విభాగం: 151 నగరాల్లో గ్రేటర్ హైదరాబాద్, సిద్దిపేటకు చోటు దక్కింది
సిల్వర్: 67 నగరాల్లో బడంగ్పేట్, నిజాంపేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నిలిచాయి
బ్రాంజ్: 143 నగరాల్లో భూపాలపల్లి, నాగారం పురపాలక సంఘాలకు చోటుదక్కింది
కాపర్: 63 నగరాల్లో అమీన్పూర్కు చోటు దక్కింది
దక్షిణాది జోన్లో..
50 వేల నుంచి లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో పరిశుభ్రమైనది: సిరిసిల్ల
ఉత్తమ సుస్థిర పట్టణం: సిద్దిపేట
25 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్: నిజాంపేట
ఫాస్టెస్ట్ మూవర్ సిటీ: ఇబ్రహీంపట్నం
25 వేల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో పరిశుభ్రమైనది: ఘట్కేసర్