ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విదేశీ బొగ్గు మాకొద్దు.. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం స్పష్టీకరణ..

By

Published : Jun 7, 2022, 10:33 AM IST

విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోబోమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో రోజుకు 50వేల టన్నుల బొగ్గును వినియోగిస్తుండగా.. అందులో 10 శాతం అంటే 5 వేల టన్నులు కచ్చితంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్రం గత నెలలో ఆదేశించింది. అన్ని రాష్ట్రాల థర్మల్‌ కేంద్రాలు తప్పనిసరిగా 10 శాతం విదేశీ బొగ్గును వాడుకోవాలని సూచించింది.

విదేశీ బొగ్గు మాకొద్దు..
విదేశీ బొగ్గు మాకొద్దు..

బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోబోమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. రోజుకు 50వేల టన్నుల బొగ్గును రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో వినియోగిస్తుండగా అందులో విదేశాల నుంచి 10 శాతం(5 వేల టన్నులు) కచ్చితంగా దిగుమతి చేసుకోవాలని కేంద్రం గత నెలలో ఆదేశించింది. అన్ని రాష్ట్రాల థర్మల్‌ కేంద్రాలు తప్పనిసరిగా 10 శాతం విదేశీ బొగ్గును వాడుకోవాలని సూచించింది. తెలంగాణకు సొంతంగా సింగరేణి గనులు అందుబాటులో ఉన్నాయని, పైగా విదేశీ బొగ్గును తెచ్చుకోవడానికి నౌకాశ్రయాలు అందుబాటులో లేనందున దిగుమతి చేసుకోలేమని రాష్ట్ర ఇంధనశాఖ తాజాగా కేంద్రానికి తెలిపింది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో ఇంకా తెలియలేదు. ఈ నెల 15లోగా విదేశీ బొగ్గు కొనుగోలుకు ఆర్డర్లు ఇవ్వకపోతే ఆ తరవాత దేశీయ బొగ్గు సరఫరాలో 15 శాతం వరకూ కోత విధిస్తామని కేంద్రం ఇంతకుముందు ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అదే జరిగితే సింగరేణి నుంచి రోజూ రాష్ట్ర థర్మల్‌ కేంద్రాలకు వచ్చే 50 వేల టన్నుల్లో 7,500 టన్నుల దాకా కోత పడుతుంది. కేంద్రం కోత విధిస్తుందో.. తెలంగాణ అభ్యర్థనను మన్నిస్తుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాలి.

మళ్లీ బొగ్గు కొరత తప్పదు..

దేశంలో గతేడాది నుంచి కొనసాగుతున్న బొగ్గు కొరత వచ్చే ఆగస్టు నాటికి మరింత తీవ్రమయ్యే సూచనలున్నట్లు దక్షిణ భారత రాష్ట్రాల విద్యుత్తు సంస్థల ప్రాంతీయ కమిటీ తాజాగా కేంద్రానికి తెలిపింది. జూన్‌లో రుతుపవనాలు వచ్చాక భారీవర్షాలు కురిస్తే గనుల్లో బొగ్గు తవ్వకాలు నిలిచిపోయి థర్మల్‌ కేంద్రాలకు సరఫరా తగ్గవచ్చని కమిటీ అంచనా. ఇదే విషయాన్ని కేంద్ర విద్యుత్తుశాఖ కూడా నెల క్రితం అన్ని రాష్ట్రాలకు తెలిపి ముందుగా బొగ్గు నిల్వలు పెంచుకోవాలని సూచించింది. ఈ కొరతను ఎదుర్కోవడానికే విదేశీబొగ్గు 10 శాతం దిగుమతి చేసుకుంటే దేశీయ బొగ్గు వినియోగం 15 శాతం వరకూ తగ్గుతుందని కేంద్ర విద్యుత్తుశాఖ లెక్కగట్టింది. మనదేశ గనుల్లో తవ్వే బొగ్గులో మట్టి కలిసి ఉండటంతో పాటు మండే స్వభావం తక్కువ. విదేశీ బొగ్గుకు మండే స్వభావం అధికంగా ఉంటుందని అక్కడి నుంచి 2 టన్నులు దిగుమతి చేసుకుంటే ఇక్కడ వాడే 3 టన్నుల దేశీయ బొగ్గు ఆదా అవుతుందని అన్ని రాష్ట్రాలకు తెలిపింది. విదేశీ బొగ్గు ధరలు అధికంగా ఉన్నందున దిగుమతులు చేసుకుంటే విద్యుదుత్పత్తి వ్యయం బాగా పెరుగుతుందని, దాని ప్రభావంతో ప్రజలపై కరెంటు ఛార్జీల భారం తప్పదని తెలంగాణ విద్యుత్తు సంస్థలంటున్నాయి.

ఇప్పటికే మూతబడ్డ 8 విద్యుత్తు కేంద్రాలు..

దేశంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం 2.03 లక్షల మెగావాట్లు. ప్రస్తుతం 173 థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో 94 చోట్ల బొగ్గు కొరత ఉన్నట్లు కేంద్ర విద్యుత్తుశాఖ నివేదికలో పేర్కొంది. వీటిలో 8 కేంద్రాలు పూర్తిగా మూతబడ్డాయి. కొన్ని ప్లాంట్లకు బొగ్గు సరఫరా చాలా తక్కువగా ఉంది. బొగ్గు గనులకు పక్కనే ఉన్న తెలంగాణలోని కొత్తగూడెం(7వ దశ) విద్యుత్తు కేంద్రంలో సైతం అవసరమైనదానిలో 23 శాతం బొగ్గు మాత్రమే నిల్వ ఉందని, సింగరేణి నుంచి దీనికి సరఫరా తక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. ఏపీ థర్మల్‌ కేంద్రాలకు ఒడిశా నుంచి బొగ్గు రావాల్సి ఉన్నట్లు వివరించింది.

అంత ధరలకు కొనలేం..

‘‘ఏపీలోని కృష్ణపట్నం, ఇతర థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలకు 31 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనడానికి ఏపీ ‘విద్యుదుత్పత్తి సంస్థ’(జెన్‌కో) మూడ్రోజుల క్రితం టెండర్లు ఆమోదించింది. టన్నుకు రూ.24,500 చొప్పున ఏపీ చెల్లించే విధంగా అదానీ సంస్థ టెండరు దక్కించుకుంది. సింగరేణి సంస్థ తెలంగాణ థర్మల్‌ కేంద్రాలకు సరఫరా చేసే టన్ను బొగ్గు ధర రూ.4 వేలలోపే. అంతకన్నా 6 రెట్లు అధికంగా చెల్లించి విదేశీ బొగ్గు కొనలేం. పైగా ఏపీకి పలు నౌకాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి’’- డి. ప్రభాకరరావు, తెలంగాణ జెన్‌కోసీఎండీ

ఇవీ చదవండి:

చావుని దగ్గర నుంచి చూశా: కియారా అద్వాణీ

HIGH COURT: విచారించకుండా అనుమతి రద్దు సరికాదు - హైకోర్టు

YSR YANTRA SEVA: వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం..!

ABOUT THE AUTHOR

...view details