ఈనెల 9 నుంచి 14 వరకు జరగనున్న తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు సర్వం సన్నద్ధమైంది. కరోనా కష్టకాలమున్నా.. ఒక్క నిమిషం నిబంధనలో ఎలాంటి మార్పు లేదని కన్వీనర్ గోవర్ధన్ స్పష్టం చేశారు. ఆలస్యంగా వస్తే అనుమతించేది లేదని వెల్లడించారు.
తెలంగాణలో 79, ఆంధ్రప్రదేస్లో 23 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు.. రెండో సెషన్లో మధ్యాహ్నం3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి లక్షా 43వేల 165 మంది దరఖాస్తు చేసుకున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ నమోదు చేయకూడదని నిర్ణయించారు. అభ్యర్థి నిర్ధరణ కోసం వెబ్క్యామ్ ద్వారా ఫొటో తీసి పోల్చి చూస్తారని కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.