ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 3, 2022, 2:45 PM IST

Updated : Sep 3, 2022, 8:15 PM IST

ETV Bharat / city

ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. ఉపాధ్యాయ దినోత్సవం బహిష్కరణ

Teachers unions on Teachers Day: రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే గురుపూజోత్సవాన్ని.. ఉపాధ్యాయులు ఈ ఏడాది బహిష్కరించాలని నిర్ణయించారు. నియంతృత్వ విధానాలతో ప్రభుత్వం తమను వేధిస్తోందంటున్న టీచర్లు.. కనీసం తమ నిరసనను తెలిపేందుకూ అవకాశం ఇవ్వట్లేదని ఆక్షేపించారు. కనీస గౌరవం ఇవ్వని ప్రభుత్వం నుంచి సత్కారం అందుకోవడం సబబు కాదని భావించామని.. అందుకే వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించామని ఉపాధ్యాయ సంఘాల నేతలు వెల్లడించారు.

Teachers
ఉపాధ్యాయ సంఘాలు

TEACHERS DAY BOYCOTT : రాష్ట్ర ప్రభుత్వం, ఉపాధ్యాయుల మధ్య అనేక విషయాల్లో నెలకొన్న సంఘర్షణకు ఇప్పట్లో తెరపడేలా లేదు. సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డ ఉపాధ్యాయులు ఉద్యోగులతో కలిసి ఈ నెల ఒకటిన చలో విజయవాడ, సీఎం నివాసం ముట్టడికి పిలుపిచ్చారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఎక్కడిక్కడ అరెస్టులు, నిర్బంధాలు, ముందస్తు నోటీసుల పేరుతో కట్టడి చేసింది. చేసేది లేక నిరసన కార్యక్రమాలను ఉద్యోగులు వాయిదా వేసుకున్నారు.

ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. ఉపాధ్యాయ దినోత్సవం బహిష్కరణ

ఈ సందర్భంగా కేసులు పెట్టడంతో పాటు పాఠశాలల్లోనే నోటీసులు ఇవ్వడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ముఖ ఆధారిత యాప్‌లోనే హాజరు నమోదు చేయాలని.. లేకపోతే విధులకు గైర్హాజరైనట్లు పరిగణిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి బొత్స సత్యనారాయణతో జరిపిన చర్చల తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాలు కూడా ఉపాధ్యాయులకు ఆగ్రహం తెప్పించాయి. అందుకే గురుపూజోత్సవం బహిష్కరించాలని వారు నిర్ణయించారు.

ప్రధానంగా బోధనేతర విధులకు తమను దూరంగా ఉంచాలని కోరుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వేడుకలకు దూరంగా ఉండి తమ నిరసనను తెలియజేస్తామని నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను సావధానంగా విని సానుకూల నిర్ణయం తీసుకోవాలని.. లేకపోతే భవిష్యత్తులోనూ నిరసనలు కొనసాగిస్తామని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి.


"అక్రమ నిర్బంధాలు, బైండోవర్లను తీవ్రంగా పరిగణిస్తున్నాం. సొంత ఫోన్లలో ఫొటోలతో హాజరు వేసేలా ఒత్తిడి చేస్తున్నారు. సీపీఎస్‌ రద్దు హామీని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం మా డిమాండ్లను సావధానంగా విని సానుకూల నిర్ణయం తీసుకోవాలి.. లేకపోతే భవిష్యత్తులోనూ నిరసనలు కొనసాగిస్తాం " -ఉపాధ్యాయ సంఘాలు

ఇవీ చదవండి:

Last Updated : Sep 3, 2022, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details