ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆన్​లైన్​లో తప్పుడు సమాచారం .. పలు పాఠశాలల్లో పోస్టులు గల్లంతు

By

Published : Nov 17, 2020, 10:36 AM IST

రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ దారి తప్పింది. కొన్నిచోట్ల పోస్టులను కాపాడుకునేందుకు కొందరు ఉపాధ్యాయులు పిల్లలు లేకపోయినా ఎక్కువగా ఉన్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మరికొన్నిచోట్ల నమోదులో తప్పుల కారణంగా ఏకంగా ఉపాధ్యాయ పోస్టులే గల్లంతయ్యాయి.

teachers rationalization
teachers rationalization

ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా పాఠశాల విద్యా శాఖ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ నిర్వహించింది. పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య నమోదుకు ఈనెల 4వరకు గడువు ఇవ్వగా.. కొన్నిచోట్ల 3వ తేదీ వరకు ఉన్న వివరాలనే పరిగణలోకి తీసుకున్నారు. అయితే పోస్టులను కాపాడుకునేందుకు పలుచోట్ల అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఇంకొన్ని చోట్ల ఏకంగా పోస్టులే గల్లంతయ్యాయి.
ఆంగ్లం, తెలుగు మాధ్యమాలు ఉన్నచోట విద్యార్థుల సంఖ్యను తెలుగు మాధ్యమంలోనే నమోదు చేయడంతో ఆంగ్ల మాధ్యమ పోస్టులు లేకుండాపోయాయి.హేతుబద్దీకరణలో చోటుచేసుకున్న తప్పుల కారణంగా పోస్టుల ఖాళీల్లోనూ స్పష్టత లోపించింది.

గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని లాం గ్రామంలో పాటిబండ్ల సీతారామయ్య మండల పరిషత్తు పాఠశాలలో ఉన్న 14మంది విద్యార్థులను వేరే బడుల్లో చదువుతున్నట్లు చూపి, రెండు పాఠశాలల్లో పోస్టులను అక్రమంగా దక్కించుకున్నారు. 12మంది విద్యార్థులను తాతిరెడ్డిపాలెం పాఠశాలలో ఉన్నట్లు చూపడంతో హేతుబద్దీకరణలో ఉపాధ్యాయ పోస్టు పోకుండా మిగిలింది. మరో ఇద్దర్ని ఫణిదరం బడిలో చదువుతున్నట్లు చూపి, ఇక్కడ మరో పోస్టును అదనంగా పొందారు. ఇలా చేయడం వల్ల లాం గ్రామంలో బడికి అదనంగా రావాల్సిన పోస్టులు రాకుండాపోయాయి.

ఈనెల మూడో తేదీ వరకు లేని విద్యార్థులను చూపించిన ఉపాధ్యాయులు ఆ తర్వాత ఈనెల 9న వీరికి టీసీలు ఇచ్చినట్లు ఆన్‌లైన్‌లో చూపారు. తమ పోస్టులను కాపాడుకున్న వెంటనే వారికి టీసీలు ఇచ్చి, పంపించినట్లు చూపారు. దీనిపై డిప్యూటీ విద్యాధికారిని విచారణకు ఆదేశించినా ఇంతవరకు నివేదిక సమర్పించలేదు. కొందరు అధికారులు డబ్బులకు కుక్కురిపడి చైల్డ్‌ ఇన్పోను మార్చేశారు.

చిత్తూరు జిల్లా తిరుచానూరు పశ్చిమ పాఠశాలలో 139మంది విద్యార్థులను అక్రమంగా చేర్చారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన అధికారులు నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు. ప్రైవేటు బడుల్లో చదువుతున్న వారిని ప్రభుత్వ బడుల్లో నమోదు చేసుకున్నట్లు తేలింది. ప్రకాశం జిల్లా గన్నవరం మండలం యద్దనపూడిలో తెలుగు మాధ్యమంలో 97మంది, ఆంగ్లంలో 45ఉండగా.. ఆంగ్లంలోని 45మందిలో 12మందిని తెలుగు మాధ్యమంలో నమోదు చేశారు. దీంతో గణిత ఉపాధ్యాయ పోస్టుల ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. కందుకూరులో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో 912మంది విద్యార్థులు ఉండగా.. సాంకేతిక కారణాలతో ఈనెల 3న ఆన్‌లైన్‌లో 771మంది విద్యార్థుల వివరాలు మాత్రమే నమోదయ్యాయి. దీంతో మూడు పోస్టులు పోయాయి.

మార్కాపురంలోనూ విద్యార్థుల సంఖ్య తక్కువగా నమోదు కావడంతో ఒక పోస్టు తొలగించారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం వెంకటేశ్వరపురం పాఠశాలలో 64మంది పిల్లలు ఉండగా.. 55మంది మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదయ్యారు. దీంతో అదనంగా రావాల్సిన పోస్టు రాకుండాపోయింది. ఉపాధ్యాయుల బదిలీలకు దాదాపు 54వేల దరఖాస్తులు రాగా ఇందులో అభ్యర్థన దరఖాస్తులు 34వేలు పైబడే ఉన్నాయి. తప్పనిసరి బదిలీలు 2వేల వరకు ఉన్నాయి.

ఇదీ చదవండి:

కోర్టులపై అభ్యంతరకర పోస్టులు.. సీబీఐ దర్యాప్తు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details