ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TEACHERS: టీచర్లకు మరుగుదొడ్ల ఫొటోలు తీసే బాధ్యత.. ఆన్‌లైన్‌ వివరాల నమోదుకే గంటల సమయం

విద్యార్థులకు బోధించడం ఉపాధ్యాయుల ప్రధాన విధి. పిల్లలు చదువుతున్నారా? ఇచ్చిన పనిని పూర్తి చేశారా? వారికేమైనా అనుమానాలు ఉన్నాయా? పాఠాలు పునశ్చరణ చేస్తున్నారా? అనే కీలక అంశాలను ఎప్పటికప్పుడు అనుశీలన చేస్తుండాలి. కానీ... వివిధ బోధనేతర పనులతోనే ప్రభుత్వ ఉపాధ్యాయుల అత్యంత కీలక సమయం గడిచిపోతోంది. విద్యార్థుల హాజరు తీసుకోవడం, మరుగుదొడ్ల పరిశుభ్రతపై ఫొటోలు తీయడం, మధ్యాహ్న భోజనం చిత్రాలు తీయడం, విద్యాకానుక కిట్ల సమాచారం, పాఠ్యపుస్తకాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వీటిలో చాలాపనులు మొదటి పీరియడ్‌లోనే చేయాల్సి వస్తోంది. ఇది బోధనపై ప్రభావం చూపుతోంది. ఇక ఏకోపాధ్యాయుడు ఉన్నచోట వీటికే గంటన్నర సమయం పడుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించకూడదనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు.

By

Published : Sep 22, 2021, 8:25 AM IST

app
app

విద్యార్థుల హాజరును మొదట రిజిస్టర్‌లో తీసుకున్న తర్వాత దాన్ని యాప్‌లో నమోదు చేస్తున్నారు. అంతర్జాల సదుపాయం బాగున్నచోట తొందరగా పూర్తవుతుండగా.. నెట్‌వర్క్‌ లేనిచోట 45 నిమిషాల వరకు సమయం పడుతోంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే దీనికి అదనం. బడిలో ఒకే పేరుతో నలుగురైదుగురు ఉంటే వీరికి హాజరు వేయడం మరింత కష్టంగా మారుతోంది. యాప్‌లో ఇంటిపేర్లు లేకపోవడంతో పిల్లల ఐడీ నంబరును దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి. కొందరు విద్యార్థులకు ఒకే పేరుంటే మరింత కష్టంగా మారుతోంది. ఉన్నత పాఠశాలల్లో ఈ బాధ్యతలను ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడికి అప్పగిస్తున్నారు. దీంతో మొదటి పీరియడ్‌ బోధనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
* రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 10వేలకు పైగా ఉన్నాయి. ఇలాంటిచోట రెండుసార్లు హాజరుకు సమయం కేటాయిస్తే పాఠాల బోధనకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యార్థులు ఒక బడి నుంచి మరో బడికి మారినప్పుడు ఆన్‌లైన్‌లో టీసీల మార్పు జరగడం లేదు. కొత్తగా చేరిన బడిలో విద్యార్థుల హాజరు నమోదు కావడం లేదు. వీరంతా అనధికారికంగానే కొనసాగుతున్నారు.

మరుగుదొడ్ల చిత్రాలు

ఉపాధ్యాయులు ప్రతిరోజూ మరుగుదొడ్ల శుభ్రతకు సంబంధించి 4-8 చిత్రాలు తీయాల్సి వస్తోంది. నెల్లూరు జిల్లాలో కొన్నిచోట్ల స్థానిక రాజకీయ కారణాలతో పారిశుద్ధ్య కార్మికుల నియామకాలు జరగలేదు. అలాంటిచోట ఉపాధ్యాయులే మురుగుదొడ్లను శుభ్రం చేసి, ఫొటోలు తీస్తున్నారు. మరుగుదొడ్లు, చేతులు కడుక్కునే బేసిన్లు, ఫ్లోర్‌... బాలురు, బాలికలకు విడివిడిగా తీసి అప్‌లోడ్‌ చేయాల్సి వస్తోంది. ఒక ఫొటో తీసి, అప్‌లోడ్‌ చేసేలోపు నెట్‌వర్క్‌ పోతే మళ్లీ ఫొటో తీయాల్సి వస్తోంది. ఈ ఫొటోలు తీసి పంపించేందుకు 20-30 నిమిషాలు పడుతోంది. నెట్‌వర్క్‌లేని బడుల్లో మొదట ఒక చిత్రాన్ని తీసి, సిగ్నల్స్‌ వచ్చేచోటకు వెళ్లి అప్‌లోడ్‌ చేసి, మళ్లీ వచ్చి ఇంకో ఫొటో తీస్తున్నారు.

మధ్యాహ్న భోజన ప్రహసనం

మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ఐఎంఎంఎస్‌ యాప్‌లో విద్యార్థుల హాజరు, మెనూ నమోదు చేయాలి. వంట గది, సరకుల నిల్వ గది, వంటపాత్రలు, ఆహార పదార్థాలు, విద్యార్థులు తినే ఫ్లోర్‌ ఫొటోలను తీసి, అప్‌లోడ్‌ చేయాలి. ఇందుకు 7-8 చిత్రాలు ప్రతిరోజు తీసి, యాప్‌లో పెట్టాల్సి వస్తోంది. నెట్‌వర్క్‌ సమస్య ఉంటే మరింత సమయం పడుతోంది. భోజన సమయంలో వీటన్నింటి తీసి, అప్‌లోడ్‌ చేసేందుకు 20-30 నిమిషాల సమయం పడుతోంది. తాజాగా డ్రైరేషన్‌ లెక్కల జాబితా తయారీ పని అప్పగించారు. విద్యా కానుక కిట్లకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల బయోమెట్రిక్‌ తీసుకుంటున్నారు. కిట్‌ కింద ఇచ్చే వస్తువుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి వస్తోంది. కొన్ని ఆన్‌లైన్‌ వివరాల నమోదుకు సెల్‌ నెట్‌వర్క్‌ సమస్య ఉన్నచోట బయట అంతర్జాల కేంద్రాలకు వెళ్లి నమోదు చేస్తున్నారు. ఇందుకు అదనపు వ్యయం ఉపాధ్యాయులపై పడుతోంది. బోధనేతర పనులను గ్రామ, వార్డు సచివాలయాల్లోని విద్య సంక్షేమ సహాయ కార్యదర్శి, ఎంఈవోల కార్యాలయాల్లో ఉండే సిబ్బందికి అప్పగిస్తే ఉపాధ్యాయులు బోధనపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య ప్రత్యేక ఆహ్వానితులు వెంకటేశ్వరరావు సూచించారు.

మంత్రి, ముఖ్యకార్యదర్శి హామీలను అమలు చేయాలి
ఉపాధ్యాయ సంఘాలతో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ నిర్వహించిన సమావేశంలో ఈ యాప్‌లన్నింటినీ తొలగిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ముఖ్యకార్యదర్శి రాజశేఖర్‌ని కలిసిన ఉపాధ్యాయులతో యాప్‌ల సంఖ్య తగ్గిస్తామన్నారు. కానీ, ఇంతవరకు అమలు చేయలేదు. నెట్‌వర్క్‌లేని చోట యాప్‌ల్లో వివరాల నమోదుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. - బాబురెడ్డి, గౌరవాధ్యక్షుడు, ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య

ఇదీ చదవండి: అవసరం లేకున్నా సిజేరియన్లు... ప్రభుత్వాసుపత్రుల్లో 34%, ప్రైవేటులో 66% కోతలు

ABOUT THE AUTHOR

...view details