ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 5, 2021, 3:37 PM IST

Updated : Nov 6, 2021, 4:35 AM IST

ETV Bharat / city

Payyavula Keshav: విద్యుత్ కొనుగోలు స్కీమ్ కాదు.. అదానీ కోసం చేసే స్కామ్: పయ్యావుల

సౌరవిద్యుత్ కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర సర్కార్​పై పీఏసీ ఛైర్మన్, తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు(Payyavula Keshav fires on ap govt news). సెకీ ద్వారా కొన్న సోలార్ విద్యుత్ ధరల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే.. ఏపీ మాత్రం ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

TDP senior leader Payyavula Keshav
TDP senior leader Payyavula Keshav

రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదివేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు కేంద్ర సౌర విద్యుత్‌ సంస్థ (సెకి)తో ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక భారీ కుంభకోణం ఉందని తెదేపా సీనియర్‌ నేత, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... అది రైతుల కోసం అమలు చేస్తున్న స్కీం కాదని... అదానీకి రూ.వేల కోట్లు దోచిపెట్టేందుకు చేస్తున్న స్కామ్‌ అని మండిపడ్డారు. ‘‘సెకి 2020 నవంబరు, డిసెంబరు నెలల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ల ఏర్పాటుకి టెండర్లు పిలిస్తే... యూనిట్‌ విద్యుత్‌ రూ.2కి, గుజరాత్‌ ప్రభుత్వం పిలిచిన టెండర్లలో యూనిట్‌ రూ.1.99కే తక్కువ ధరకు బిడ్లు దాఖలయ్యాయి. అదే సెకితో రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌ రూ.2.49కి కొనేందుకు ఒప్పందం చేసుకుంది. పైగా దేశంలోనే అతి తక్కువ ధరకు విద్యుత్‌ కొన్నామని, దానితో రాష్ట్రానికి లాభమేనని ప్రజల్ని మోసగిస్తోంది...’’ అని కేశవ్‌ ధ్వజమెత్తారు. ఒక పక్క యూనిట్‌ రూ.1.99కే వస్తుంటే... ప్రభుత్వం రూ.2.49కి కొనడం ఏ విధంగా లాభదాయకం? అని ఆయన ప్రశ్నించారు. యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49కి కొన్నట్లు ప్రభుత్వం చెబుతున్నా... కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు వెనక్కు తీసుకుంటే డిస్కంలకు చేరేసరికి దాని ధర రూ.3.50 నుంచి రూ.4.50 వరకు పడుతుందన్నారు. ఈ ఒప్పందం వల్ల వచ్చే 25 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలపై రూ.1.20 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన వెల్లడించారు.

అదానికీ దొడ్డిదారిన కట్టబెడుతోంది
ఆరు వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మొదట టెండర్లు పిలిస్తే అదానీ సంస్థకు బిడ్‌ ఖరారైంది. కోర్టు ఆ టెండర్ల ప్రక్రియను రద్దు చేయడంతో... అదే అదానీ సంస్థకు ప్రభుత్వం దొడ్డిదారిన ప్రాజెక్టు కట్టబెడుతోంది. ఇది రూ.30 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుని నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చేయడమే. దీనికి న్యాయ సమీక్ష, రివర్స్‌ టెండరింగ్‌ వర్తించవా?’’ అని కేశవ్‌ నిలదీశారు. ‘‘సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు సెకి పిల్చిన టెండర్లలో అదానీ సంస్థ యూనిట్‌కి రూ.2.90కిపైగా కోట్‌ చేసింది. అంత ధరకు విద్యుత్‌ కొనేందుకు ఏ రాష్ట్రమూ ముందుకు రాలేదు. అదానీ సంస్థ యూనిట్‌ ధరను రూ.2.49కి తగ్గించిందని, ఒప్పందం చేసుకోవాలని సెకి సెప్టెంబరు 15న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. వెంటనే కేబినెట్‌ నోట్‌ సిద్ధం చేశారు. సెప్టెంబరు 16న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసేసుకున్నారు. రూ.30 వేల కోట్ల పెట్టుబడులపై నిర్ణయం తీసుకునేటప్పుడు లోట్లుపాట్లు చూడరా? అదానీ సంస్థ యూనిట్‌ ధర రూ.2.49కి తగ్గించిందని సెకి చెబితే ఒప్పందం చేసేసుకోవడమేనా? సోలార్‌ ప్యానెళ్ల ధరలు గణనీయంగా తగ్గాక కూడా... యూనిట్‌కి రూ.2.49 ప్రభుత్వానికి చౌకగా కనిపించిందా? అదే చౌక ధర అయితే ఇతర రాష్ట్రాలు ఎందుకు కొనడం లేదు?’’ అని కేశవ్‌ ధ్వజమెత్తారు.

ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడుల్ని ప్రోత్సహించడమేమిటి?
‘‘ఏ ముఖ్యమంత్రి అయినా మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని అడగాలి. ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడుల్ని ప్రోత్సహించడమేమిటి? ఏం మన రాష్ట్రమేమైనా గొడ్డుపోయిందా? రైతులకు ఉచిత విద్యుత్‌ పథకానికి మేం వ్యతిరేకం కాదు. 10 వేల మెగావాట్లు పెడతారో... 50 వేలు పెడతారో ప్రభుత్వం ఇష్టం. ఆ పెట్టే సౌర విద్యుత్‌ ప్లాంట్లు ఏవో చట్ట ప్రకారం ఏపీఈఆర్‌సీ అనుమతి తీసుకుని మన రాష్ట్రంలోనే పెట్టాలి. అదానీ సంస్థ సోలార్‌ ప్యానెళ్లు గుజరాత్‌లో తయారు చేస్తామని, ప్లాంట్‌ రాజస్థాన్‌లో పెడతామని చెబుతోంది. రూ.30 వేల కోట్లపై జీఎస్టీ గుజరాత్‌ ప్రభుత్వానికి వెళుతుంది. ప్రధానికి దగ్గరగా ఉన్నవారికి మేలు చేయడానికి రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం తాకట్టు పెడితే అంగీకరించం. మన రాష్ట్రంలో ప్లాంట్లు పెడితే రైతులకు, నిరుద్యోగులకు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. 25 ఏళ్ల తర్వాత ఆ ప్లాంట్లు ప్రభుత్వ ఆస్తిగా మారిపోతాయి...’’ అని కేశవ్‌ పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు అవసరానికి మించి ఒప్పందాలు చేసుకోవడం వల్ల గ్రిడ్‌కు ముప్పు ఏర్పడుతుందని చెప్పి... ఈ ప్రభుత్వం పవన విద్యుత్‌ సంస్థల నుంచి కొనడం ఆపేసింది. ఇప్పుడు తొమ్మిదివేల మెగావాట్లు బయటి రాష్ట్రాల నుంచి కొంటే మన గ్రిడ్‌ తట్టుకుంటుందా?’’ అని ఆయన ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:CBN Letter To SEC:'కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు'..ఎస్​ఈసీకి చంద్రబాబు లేఖ

Last Updated : Nov 6, 2021, 4:35 AM IST

ABOUT THE AUTHOR

...view details