సెలక్ట్ కమిటీకి బిల్లుల్ని పంపిస్తే.. అధికారపక్షం విమర్శలు చేయడం దారుణమని.. ఎమ్మెల్సీ అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. ఓటింగ్, డివిజన్ లేకుండా నిర్ణయం తీసుకోకూడదని వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. వెలగపూడిలో రాజధాని రైతులు, మహిళల దీక్షకు ఎమ్మెల్సీలు నాగ జగదీశ్వరరావు, అశోక్ బాబు, తెదేపా సాంస్కృతిక విభాగం నేత గుమ్మడి గోపాలకృష్ణ సంఘీభావం తెలిపారు. రాజ్యసభ, లోక్సభలో తీర్మానం అవసరం లేకుండానే బీఏసీ సమావేశంలోనే బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి లేదా స్టాండింగ్ కమిటీకి పంపిస్తున్న విషయాన్ని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. మండలిలో ఛైర్మన్కు సర్వాధికారాలు ఉన్నాయని.. ఒకవేళ ఓటింగ్ పెట్టినా రూల్ 71లో మాదిరిగానే అమరావతి కోసం అన్నిపార్టీల ఎమ్మెల్సీలు ఏకమయ్యేవారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గుమ్మడి గోపాలకృష్ణ.. పద్యాల ద్వారా రాజధాని తరలింపు నిర్ణయాన్ని ఎండగట్టారు.
'పదవులు త్యాగం చేసైనా అమరావతిని కాపాడుకుంటాం'
ఎమ్మెల్సీ పదవులను త్యాగం చేసైనా సరే అమరావతిని కాపాడుకుంటామని తెదేపా ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావు స్పష్టం చేశారు. త్వరలో తెదేపా తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్ర ప్రభుత్వాన్ని కలవనున్నట్లు తెలిపారు.
'పదవులు త్యాగం చేసైనా.. అమరావతి కాపాడుకుంటాం'