పేదలకు ఇళ్ల స్థలాలపై వైకాపా నేతలతోనే కోర్టులో పిటిషన్ వేయించి తమపై బురద జల్లుతున్నారని తెదేపా మండిపడింది. ‘పేదల గృహాలకు పునాదుల దశలో ఇచ్చే మొత్తానికి సంబంధించి కేంద్రం విడుదల చేసిన రూ.3,700 కోట్లలో రూ.2 వేల కోట్లను ప్రభుత్వం దారి మళ్లించింది. సెంటు పట్టాల పంపిణీలోనూ వైకాపా నేతలు రూ.6,500 కోట్ల అవినీతికి పాల్పడ్డారు’ అని ధ్వజమెత్తింది. పార్టీ ముఖ్య నేతల సమావేశం సోమవారం తెదేపా అధినేత చంద్రబాబు(chandrabau news) అధ్యక్షతన ఆన్లైన్లో జరిగింది. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర నిధుల నుంచి మరో రూ.2 లక్షల చొప్పున విడుదల చేయాలని, దారి మళ్లించిన నిధుల్నీ వెంటనే జమ చేయాలని తెదేపా డిమాండ్ చేసింది. సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలివీ.
కమీషన్ల కోసమే విద్యుత్ కృత్రిమ కొరత
*రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లలో సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయిస్తే బహిరంగ మార్కెట్లో రూ.15 నుంచి రూ.20 పెట్టి కొనాల్సిన అవసరం రాదు. కమీషన్ల కోసం కృత్రిమంగా కొరత సృష్టించి బహిరంగ మార్కెట్లో కొంటున్నారు. తెలంగాణకు లేని సమస్య ఆంధ్రప్రదేశ్కు ఎందుకు వచ్చింది? రోజుకి 2,3 గంటల అప్రకటిత కోతలు విధిస్తున్నారు. బిల్లులు కట్టలేదని ప్రభుత్వ పాఠశాలలకు కనెక్షన్ కట్ చేస్తున్నారు.
*ఆసరా పేరుతో జగన్రెడ్డి మహిళలకు టోకరా పెట్టారు. తెదేపా హయాంలో 98 లక్షల మంది మహిళలకు, అందరికీ సమానంగా లబ్ధి చేకూర్చగా, జగన్ ఆ సంఖ్యను 78 లక్షలకు కుదించారు. డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.21 వేల కోట్లు జమ చేస్తే, జగన్రెడ్డి ఇప్పటి వరకు రూ.10 వేల కోట్లు కూడా వేయలేదు.
*ఉపాధి హామీ పెండింగ్ బిల్లులపై న్యాయస్థానం తీర్పుతోనైనా జగన్రెడ్డి తీరు మారాలి.