ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్ సర్కార్ పాలనపై తెదేపా నేతల ఆగ్రహం

వైకాపా పాలనపై తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో విద్యావ్యవస్థ దారుణంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆస్తులను కాజేసేందుకు స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేశారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై డ్రామాలు ఆడుతున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, దిశ యాప్ ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది మహిళలను రక్షించాలో చెప్పాలని డిమాండ్ చేశారు.

By

Published : Jul 2, 2021, 9:25 PM IST

TDP leaders fire on cm jagan
జగన్ సర్కార్ పాలనపై తెదేపా నేతల ఆగ్రహం

వైకాపా పాలనలో విద్యా వ్యవస్థ దారుణంగా తయారైందని మాజీ మంత్రి, తెదేపా నేత జవహర్ ఆరోపించారు. తెదేపా హయాంలో కట్టిన పాఠశాల భవనాలకు నేడు రంగులేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో విశ్వవిద్యాలయం స్థాపిస్తే... ఆ పేరుకు అదనంగా ఆంధ్రకేసరి అనే పదాన్ని జోడించి మళ్లీ ప్రారంభించారని ఆక్షేపించారు. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో విద్యావ్యవస్థలో నాడు ఏపీ మూడో స్థానంలో ఉంటే నేడు 19వ స్థానానికి పడిపోయిందని జవహర్ ఆవేదన వ్యక్తం చేశారు. అనుచరులకు నిధులు సమకూర్చేందుకు నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నారని ధ్వజమెత్తారు. 80లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన అమ్మఒడిని 40లక్షల మంది విద్యార్థులకే పరిమితం చేశారని దుయ్యబట్టారు. విద్యాశాఖలో మార్పుల కోసం ఇకనైనా పద్ధతి మార్చుకుని, మేథావులు, నిపుణులు, తల్లిదండ్రుల సూచనలు తీసుకోవాలని జవహర్ హితవు పలికారు.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వండి...

స్వామివారి భూములు, బంగారు అభరణాలు, ఇతర సంపదపై జగన్ రెడ్డి కన్ను పడిందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య అన్నారు. అందుకే హిందూయేతరులతో తితిదే పాలకమండలి ఏర్పాటు చేసి, కాలపరిమితి ముగిశాక స్పెసిఫైడ్ అథారిటీ పేరుతో తనకు అనుకూలంగా ఉండే ఇద్దరు దేవస్థానం ఉద్యోగుల్ని సభ్యులుగా పెట్టారని ఆరోపించారు. స్పెసిఫైడ్ అథారిటీని రద్దు చేసి, 19మంది హిందువులతో పాలకమండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ వేయించుకోని 45ఏళ్ల పైబడిన తితిదే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వమని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజకీయ లబ్ధి కోసమే...

రాజకీయ లబ్ధి కోసమే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలవివాదంపై డ్రామాలు ఆడుతున్నారని మాజీమంత్రి ఆలపాటి రాజా దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకే జలవివాదానికి తెరలేపారని ఆక్షేపించారు. ప్రతిపక్ష నేతలపై అనవసరంగా నోరు పారేసుకునే ఏపీ మంత్రులు... తెలంగాణ మంత్రులు రెచ్చగొడుతున్నా నోరు మెదపకపోవటానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్​లో ఉన్న ఆస్తులను కాపాడుకునేందుకే జగన్​రెడ్డి కేసీఆర్ వద్ద ఏపీ హక్కుల్ని బలిపెడుతున్నారని ఆలపాటి రాజా అన్నారు.

వివరాలు బయటపెట్టండి...

మహిళల్ని కాపాడలేని సీఎం జగన్... పదవికి రాజీనామా చేయాలని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. హోంమంత్రి సహా వైకాపా మహిళా ప్రజాప్రతినిధులు బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు. అసమర్ధ ముఖ్యమంత్రి పాలనలో పోలీసులు సైతం విధినిర్వహణ మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని దిశ చట్టంతో హడావుడి చేస్తూ మహిళల మానప్రాణాలు పోతున్నా పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళల్ని రక్షించి, నిందితుల్ని శిక్షించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తక్షణమే రద్దు చేయాలి...

తిరుమల స్వామివారి ఆస్తులు, సొమ్ము కాజేసేందుకే స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేశారని తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పెసిఫైడ్ అథారిటీని రద్దుచేసి, తితిదే పాలకమండలిని పునర్నియమించాలని డిమాండ్ చేశారు. ప్రసాదం విక్రయంలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడే కుట్రలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రైవేట్ వ్యక్తులకు శ్రీవారి ప్రసాదం లడ్డూ విక్రయ కౌంటర్లు అప్పగించారని విమర్శించారు.

ఇవీచదవండి.

Devineni Uma: నదీజలాల విషయంలో జగన్‌, కేసీఆర్‌వి డ్రామాలు: దేవినేని

19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details