ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 12, 2021, 3:59 PM IST

ETV Bharat / city

కొడాలి నాని, జోగి రమేష్​ను ఎందుకు అరెస్టు చేయరు..?: తెదేపా

పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం చూసి వైకాపా నాయకులు తట్టుకోలేకపోతున్నారని... మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. అందుకే వైకాపాకు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

TDP Leaders comments on ycp govt
కొల్లురవీంద్ర, వర్ల, బొండా ఉమ


ప్రభుత్వ ఒత్తిడితో అచ్చెన్నాయుడుపైనా, తనపైనా అక్రమ కేసులు పెట్టిన పోలీసులు... చట్టాలు ఉల్లంఘించిన కొడాలి నాని, జోగి రమేష్​ను ఎందుకు అరెస్టు చేయలేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.

వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ... "పంచాయితీ ఎన్నికల్లో ప్రతిపక్షాల పార్టీ నేతలు పోటీ చేయకుండా ఎమ్మెల్యేలే బెదిరిస్తున్నారు. పోలీసులకు ఇవేమీ కనిపించడం లేదా. బెదిరింపులకు పాల్పడిన నాయకులపై ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలి. అధికారం ఉందని మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.... విశాఖ ఉక్కు పరిశ్రమ గొంతు కోసిన ముఖ్యమంత్రి జగన్, వైకాపా ప్రజా ప్రతినిధులతో కలిసి నాటకాలు ఆడుతున్నారు. విశాఖ ఉక్కు కోసం తెదేపా నేత పల్లా శ్రీనివాస్ ఆమరణ దీక్ష చేస్తున్నారు. మాజీమంత్రి గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు. శ్రీనివాస్​కి ఏం జరిగినా ఆ బాధ్యత ప్రభుత్వానిదే." అని దుయ్యబట్టారు.

ప్రభుత్వానికి ఎస్ఈసీ భయపడినట్లుంది: వర్ల

పంచాయితీ ఎన్నికల్లో అభ్యర్థులను బెదిరించిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్​ను ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీచేయకుండా బహిష్కరించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వైకాపా అరాచకాలకు ఎన్నికల సంఘం తలొగ్గిందనటానికి బరితెగించి మాట్లాడుతున్న మంత్రులు, నేతలపై నామమాత్రపు చర్యలే నిదర్శనమని మండిపడ్డారు. 90శాతం పైగా పంచాయితీలు గెలవాలని మంత్రులకు లక్ష్యాలు నిర్ధేశించిన ముఖ్యమంత్రికి ఎందుకు నోటీసులిచ్చి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మంత్రులు బాలినేని, పెద్దిరెడ్డిలపై చర్యలు తీసుకోకపోవటంతో ఎన్నికల సంఘం ప్రభుత్వానికి భయపడి నిర్వీర్యమైపోయిందన్నది సుస్పష్టమైందన్నారు. కొడాలి నాని వాడిన భాషకు నోటీసులిస్తే ఏం సరిపోతుందన్న వర్ల...కొడాలి నాని వాడే భాషకు ఆయన కుటుంబ సభ్యులే తలదించుకుంటారని మండిపడ్డారు. గుడివాడ ప్రజలు కొడాలి నానికి ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతున్నారని విమర్శించారు. నిబంధనలు అతిక్రమించిన అధికార పార్టీ నేతలు ఎంత మందిపై చర్యలు తీసుకున్నారో డీజీపీ సమాధానం చెప్పాలని నిలదీశారు.

అక్రమాలపై ఫిర్యాదు చేశాం: బొండా ఉమ

రాజ్యాంగం, వ్యవస్థలపై వైకాపాకు గౌరవం లేదని తెదేపా నేత బొండా ఉమ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికారులు వైకాపా నేతలు చెప్పినట్లు పనిచేస్తున్నారని తెలుగుదేశం నేత బొండా ఉమామహేశ్వరావు ఆరోపించారు. మహిళా అభ్యర్థులపై బైండోవర్ కేసులు పెడుతున్నారన్నారు. ఎస్‌ఈసీని కలిసిన ఫిర్యాదు చేశామన్న ఆయన... నిమ్మగడ్డను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

బెదిరించి ఎన్నికలు నిర్వహిస్తున్నారు: కూన రవికుమార్

ABOUT THE AUTHOR

...view details