ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెద్దిరెడ్డి ఎందుకు ముఖం చాటేశారు?: పట్టాభి - Pattabhi comments on peddireddy

నష్టాల్లో ఉన్న కంపెనీకి ఇసుక రీచ్​లు కట్టబెట్టడం ఏంటంటూ... తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. ఇసుక రీచ్​లపై తాము అడిగిన ప్రశ్నలకు మంత్రి ఎందుకు ముఖం చాటేశారని పట్టాభి ప్రశ్నించారు. పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మరోసారి తన డొల్లతనం చాటుకున్నారని ఎద్దేవా చేశారు.

TDP Leader Pattabhi Counter To Dwivedi
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

By

Published : Mar 22, 2021, 7:56 PM IST

రాష్ట్రంలో ఉన్న ఇసుక రీచులన్నీ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్​కు ఎందుకు కట్టబెట్టారని తాము ప్రశ్నిస్తే.. మంత్రి పెద్దిరెడ్డి ఎందుకు ముఖం చాటేశారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నిలదీశారు. బండారం బయటపడేసరికి సంబంధిత మంత్రి ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి మీడియా ముందుకు వచ్చి తామడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

"ఇసుక రీచ్​ల్లో క్విడ్ ప్రోకో జరిగిందని మేం ఆధారాలతో సహా బయటపెడితే... మంత్రి బయటకు రాకపోగా టెండర్లు ఖరారు చేసి 24 గంటలు గడవకుండానే టన్ను ఇసుకపై రూ.100 పెంచేశారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి లారీ ఇసుకపై అదనంగా 5 వేల వరకూ ధర పెంచేసి ప్రజలకు ఏం లాభం చేశారు? వీటికి రవాణా ఛార్జీలు, హ్యాండ్లింగ్ ఛార్జీలు, జె ట్యాక్స్ అదనంగా భరించాల్సి వస్తోంది. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి వేల కోట్ల రూపాయలు జేబులు నింపుకొనేందుకు పేదల పొట్ట కొట్టారు. పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ప్రజలకు ఇంకా చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేసి తన డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారు. సీఎం జగన్ ఏది దొరికితే అది హోల్ సేల్​గా కొట్టేసేందుకు అలవాటు పడ్డారు" అని పట్టాభి మండిపడ్డారు.

'ద్వివేది సమాధానం దాటవేశారు'

ఇసుక రీచ్​ల క్విడ్ ప్రోకోపై తాము అడిగిన ఏ ప్రశ్నకీ ద్వివేదీ సమాధానం చెప్పలేదని పట్టాభి ఆక్షేపించారు. "జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థ రూ.3500 కోట్లు అప్పుల ఊబిలో ఉన్న విషయంపైనా ద్వివేదీ సమాధానం దాటవేశారు. సంస్థ డైరెక్టర్ పెద్దిబొట్ల గంగాధర శాస్త్రి వ్యవహారంపై ఎందుకు సమాధానం చెప్పలేదు. 3 కోట్ల 75 లక్షల టన్నుల ఇసుక లభ్యతకు గాను 2 కోట్ల టన్నులేనని కాకిలెక్కలు చెప్పారు. సంవత్సరానికి రూ.50 కోట్లు పని చేసేందుకు జయప్రకాష్ వెంచర్స్ సంస్థ వచ్చిందని కాకమ్మ కథలు చెప్తూ దోపిడీని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. 2 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలను.. 9 లక్షల మెట్రిక్ టన్నుల తవ్వక అనుభవం మాత్రమే ఉన్న సంస్థకు ఎలా కట్టబెట్టారు? టెండర్ నిబంధనలన్నీ రాష్ట్ర ప్రభుత్వమే రూపొందించి ఎంఎస్​టీసీకి కేవలం టెండర్ ప్రక్రియ మాత్రమే అప్పగించింది. ద్వివేదీ మాత్రం అంతా ఎంఎస్​టీసీనే చేసినట్లు అసత్యాలు చెప్పారు" అని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

పాక్‌ జలసంధిని ఈదిన.. తెలుగింటి ఆడపడుచు గోలి శ్యామల

ABOUT THE AUTHOR

...view details