గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు గత నోటిఫికేషన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తై మెరిట్ జాబితాలో పేర్లున్న అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వాలని సీఎం జగన్కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది నియామకానికి సంబంధించి నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైనప్పటికీ చాలామందికి నియామకపత్రాలు అందక ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.
వారికి అన్యాయం చేయకండి
0.25, 0.50, 0.75 & 1 మార్కు తేడాతో అన్ని పోస్టులకు వెరిఫికేషన్ పూర్తైన అభ్యర్థులు రాష్ట్రంలోని 13 జిల్లాలో వేలమంది ఉన్నారన్న లోకేశ్... ఈ నియామకాల గురించి అధికారులను సంప్రదిస్తే ఎటువంటి ఆదేశాలు లేవని చెబుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో రెండో దఫా నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తైన వారు, స్వల్ప తేడాతో ఎంపికై వెయిటింగ్ లో ఉన్నవారిలో ఆందోళన మొదలైందని వెల్లడించారు. కొత్త నోటిఫికేషన్ నిర్వహించడమంటే ఇప్పటి వరకు వెయిటింగ్ లో ఉన్న వారందరికీ అన్యాయం చేయడమేనని స్పష్టం చేశారు. సచివాలయంలోని ఉద్యోగాలకు రాజీనామా చేసిన, ఇతర కారణాలతో ఖాళీ అయిన స్థానాలను, తొలి విడత పరీక్షలో అర్హత సాధించి మెరిట్ లిస్ట్ లో ఉన్న వారితో, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైన అభ్యర్థులతో భర్తీ చేయాలని సూచించారు.