ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనుక సూత్రధారి వైకాపానే: బొండా ఉమ

By

Published : Feb 8, 2021, 4:58 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు.. తెరవెనుక సూత్రధారి వైకాపానేనని... తెలుగుదేశం నేత బొండా ఉమ ఆరోపించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం పార్లమెంటులో ప్రకటించినప్పుడు వైకాపా ఎంపీలు మౌనంగా ఉండి.... ఇప్పుడు మాట్లాడడం కంటితుడుపు చర్యలా ఉందని విమర్శించారు. ప్రధానికి సీఎం లేఖ కూడా అందులో భాగమేనన్నారు.

TDP Leader Bonda Uma
తెదేపా నేత బొండా ఉమ

'విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొట్టేయడానికి తెరవెనుక రంగం సిద్ధం చేసుకున్న జగన్, తెరముందు మాత్రం కేంద్రానికి లేఖలు రాశానంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు' అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమ ధ్వజమెత్తారు. 2019 అక్టోబర్ 29న జగన్ తన నివాసంలో దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీతో చర్చలు జరిపారని ఆరోపించారు. 2 లక్షల కోట్ల విలువైన ఉక్కు కర్మాగారాన్ని 5 వేల కోట్ల రూపాయలకు కొట్టేసేలా జగన్.... సదరు కంపెనీ ప్రతినిధులతో బేరసారాలు జరిపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జగన్ చర్చల వ్యవహారం కేంద్ర పెద్దలకు ముందే తెలుసనన్న బొండా ఉమ ...దానికనుగుణంగానే పార్లమెంట్​లో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై ప్రకటన వెలువడిందని ఆక్షేపించారు. కేంద్రం ప్రకటించాక తనకేమీ తెలియనట్లు జగన్ లేఖలు రాస్తుంటే, వైకాపా ఎంపీలు తమకేమీ తెలియదన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి, వైకాపా ప్రభుత్వం దొంగనాటకాలను ప్రజలముందు ఎండగడుతూనే, విశాఖ ఉక్కుఫ్యాక్టరీని కాపాడుకునేందుకు తెదేపా పోరాటం చేస్తుందని బొండా ఉమ తెల్చిచెప్పారు.

ABOUT THE AUTHOR

...view details