ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 13, 2020, 5:44 PM IST

Updated : Jun 13, 2020, 7:25 PM IST

ETV Bharat / city

అచ్చెన్నాయుడు అరెస్టు తర్వాత.. అర్ధరాత్రి నుంచి ఏం జరిగింది?

ఈఎస్​ఐ మందులు, పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని అనిశా అధికారులు నిర్ధరించారు. ఈ వ్యవహారంపై కేసులు నమోదు చేసిన అనిశా... గతంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుతో సహా ఏడుగురు ఈఎస్​ఐ అధికారులను అరెస్టు చేసింది. అయితే అచ్చెన్నాయుడు అరెస్టు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. అనంతర పరిణామాలు అంతే హైడ్రామాను తలపించాయి. ముఖ్యంగా ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అచ్చెన్నాయుడు అరెస్టు.. అర్ధరాత్రి ఏం జరిగింది?
అచ్చెన్నాయుడు అరెస్టు.. అర్ధరాత్రి ఏం జరిగింది?

ఈఎస్​ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు... నాటకీయ పరిణామాలకు దారి తీసింది. శుక్రవారం ఉదయం వంద మంది పోలీసులు నిమ్మాడలోని అచ్చెన్నాయుడు నివాసాన్ని చుట్టుముట్టారు. అరెస్టు చేస్తున్నట్లు అచ్చెన్నకు తెలిపిన అధికారులు... క్షణాల్లో తంతు ముగించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అచ్చెన్నను అరెస్టు చేసిన పోలీసులు... రోడ్డు మార్గంలో 480 కిలో మీటర్లు ప్రయాణించి..గొల్లపూడి విజయవాడ రేంజ్ అనిశా కార్యాలయానికి తీసుకొచ్చారు.

నిమ్మాడ టు విజయవాడ

పటిష్ఠ భద్రతతో అచ్చెన్నాయుడిని గొల్లపూడికి తీసుకువచ్చిన పోలీసులు... ఈఎస్​ఐ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా​, తర్వాత స్వయంగా అచ్చెన్నాయుడిని అనిశా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అచ్చెన్నకు న్యాయ సహాయం అందించేందుకు ఆయన న్యాయవాదులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఏ దశలోనూ ఆయన్ను కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. అప్పుడే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ అక్కడకు చేరుకున్నారు. అచ్చెన్నను కలిసేందుకు ప్రయత్నించారు. ఆయన్నీ పోలీసులు, అనిశా అధికారులు అనుమతి ఇవ్వకవపోవడం.. కాసేపు ఉద్రిక్తతకు కారణమైంది.

గుంటూరు జీజీహెచ్​లో చికిత్స

అనిశా న్యాయమూర్తి.. అచ్చెన్నాయుడుకు 14 రోజులు రిమాండ్ విధించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశాలతో ఆయన్నుగుంటూరు జీజీహెచ్​కు తరలించారు. అచ్చెన్నాయుడికు ఈ నెల 11న శస్త్రచికిత్స జరిగిందని... రోడ్డు మార్గంలో ప్రయాణించడం వల్ల రక్తస్రావమైందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు... గాయం తీవ్రత పెరిగితే తిరిగి శస్త్ర చికిత్స​ చేస్తామన్నారు. ఆ అవసరం లేకుండా రెండు, మూడు రోజుల్లో గాయం నయమయ్యే అవకాశాలు ఉన్నాయని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ స్పష్టం చేశారు.

చంద్రబాబుకు అనుమతి నిరాకరణ

గుంటూరు జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును కలిసేందుకు... తెదేపా అధినేత చంద్రబాబుజైలు అధికారులను అనుమతి కోరారు. కానీ అధికారులు అందుకు నిరాకరించారు. గుంటూరులో కొవిడ్ నిబంధనల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. చంద్రబాబు మరో వినతిపై స్పందించిన జీజీహెచ్ సూపరింటెండెంట్... మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని సూచించారు.

ఇంత దుర్మార్గమా!

అధికారుల తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండు రోజుల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తి పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు. ఆయనకు ఏదైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకే... పార్టీ మారనందుకే కక్షసాధింపులకు తెగబడ్డారని పునరుద్ఘాటించారు. లేనిపోని నకిలీ దస్త్రాలతో కేసులు పెట్టారని ఆరోపణలు చేశారు.

వాగ్యుద్ధం

తెలుగుదేశం నేతలు కూడా అచ్చెన్నకు మద్ధతుగా నిలిచారు. ఆయన అరెస్టు అనైతికమని నినదించారు. సీఎం జగన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న తెదేపా నేతల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

వైకాపా ఎదురుదాడి

తెదేపా విమర్శలకు వైకాపాఘాటుగానే స్పందించింది. అవినీతిపై ఆధారాలున్నాయని సమాధానం ఇచ్చింది. అక్రమాలకు పాల్పడిన మరింతమంది నేతల అరెస్టులు తప్పవని హెచ్చరించింది.

తెదేపా శ్రేణుల ఆందోళనలు

అచ్చెన్నాయుడు అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న బలమైన నాయకులను వైకాపా లక్ష్యంగా చేసుకుందని ఆరోపణలు చేశారు.

సంబంధిత కథనాలు :

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్

పరామర్శించడానికి వెళితే అనుమతి ఇవ్వలేదు: చంద్రబాబు

అచ్చెన్నాయుడు అరెస్ట్​పై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం

Last Updated : Jun 13, 2020, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details