ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతిని మార్చే హక్కు మీకు లేదు: చంద్రబాబు

By

Published : Feb 4, 2020, 9:17 PM IST

Updated : Feb 4, 2020, 9:38 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలో అమరావతి ఐకాస బహిరంగ సభకు.. తెదేపా జాతీయ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. రాజధాని విషయంలో ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

tdp chief chandrababu
tdp chief chandrababu

జగన్​ పాలన తుగ్లక్​ పాలనను తలపిస్తోందన్న తెదేపా అధినేత చంద్రబాబు

అమరావతి విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. గుంటూరు జిల్లా తెనాలిలో అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించిన బహిరంగ సభకు చంద్రబాబు సహా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఐకాస నేతలు హాజరయ్యారు. తెదేపా ప్రభుత్వం ఉన్నప్పుడు.. జగన్‌ ఎక్కడికి వెళ్లినా అడ్డుకోలేదని చంద్రబాబు చెప్పారు. ఇలా అడ్డుకుంటే జగన్‌ రాష్ట్రంలో తిరిగేవారా? అని ప్రశ్నించారు. నాయకులు ప్రతిమాటా జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. గుంటూరు జిల్లా వైకాపా నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు సైతం అమరావతి ఉద్యమం చేస్తున్నారని గుర్తు చేసిన చంద్రబాబు.. ఇప్పటివరకు 37 మంది రైతులు చనిపోయారని.. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని స్పష్టం చేశారు.

''వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజు త్వరలోనే వస్తుంది. వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారు. తెనాలిలో చిల్లర రౌడీలు రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేశారు? ఆఖరికి ధర్నా శిబిరం తగలబెడతారా? విధ్వంసం, కక్షకు కూడా హద్దులు ఉంటాయి. సీఎం జగన్‌ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ప్రజావేదిక కూల్చారు.. అది ఎవరి ఆస్తి..? పోరాటంలో ఎప్పుడూ ధర్మం, న్యాయమే గెలిచింది. నేను ఒక్క పిలుపు ఇస్తే రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. శివరామకృష్ణన్‌ కమిటీ కూడా అమరావతికి సిఫారసు చేసింది. అమరావతిని మార్చే అధికారం మీకు లేదు. ఉన్న రాజధానిని గతంలో ఎప్పుడూ మార్చలేదు'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తుగ్లక్​ మళ్లీ పుట్టారు

నయా తుగ్లక్ మన రాష్ట్రంలో మళ్లీ పుట్టారని ముఖ్యమంత్రిని ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. ఒక రాజధానే ఉండాలని జాతీయ పత్రికలు చెప్పాయని గుర్తు చేశారు. సామాజిక స్పృహ లేకుండా వైకాపా నేతలు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహించారు. దేశంలోని అన్ని ప్రార్థనాలయాల నుంచి మట్టి తెచ్చి అమరావతిని పవిత్రం చేశామన్నారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రచారం చేస్తున్నారని అన్న చంద్రబాబు.. తాను ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు.. చెయ్యను అని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. హుద్‌హుద్ తర్వాత విశాఖ రూపురేఖలు మార్చామని.. అనంతపురం, తిరుపతి, కర్నూలును అభివృద్ధి చేశామని చెప్పారు.

Last Updated : Feb 4, 2020, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details