ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 25, 2022, 10:57 PM IST

ETV Bharat / city

కుప్పంలో వైకాపా విధ్వంసాన్ని నిరసిస్తూ తెదేపా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

Agitations All over Ap కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా వైకాపా తీరుపై రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు మండిపడ్డాయి. అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించాయి. చంద్రబాబుని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేస్తే జగన్ పాదయాత్ర చేసేవారా అని నిలదీశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా అల్లకల్లోలం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెదేపా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
తెదేపా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

TDP protest: డీజీపీ కార్యాలయ ముట్టడి.. కుప్పంలో వైకాపా విధ్వంసాన్ని నిరసిస్తూ.. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు నిరసన తెలుపుతూ ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. ప్రధాన ద్వారం తోసుకుని లోపలికి వెళ్లేందుకు తెలుగు యువత కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. నల్లజెండాలు, తెదేపా జెండాలతో డీజీపీ కార్యాలయ గేటు వద్ద అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో.. బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనతో డీజీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జెడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబుకే రక్షణ లేనప్పుడు.. ఇక సామాన్యుల గతేంటని నిలదీశారు. పోలీసులు తీరు మార్చుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు, శ్రేణులు రోడ్డెక్కుతారని హెచ్చరించారు. చివరకు పోలీసులు, డీజీపీ కార్యాలయం గేటు వద్దనే తెలుగుదేశం నేతల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు.

తిరుపతి: కుప్పంలో జరిగిన ఘటనను నిరసిస్తూ తిరుపతిలో ఆపార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. తిరుపతిలోని ఎన్టీఆర్ కూడలిలో మోకాళ్లపై నిలబడి వినూత్నంగా ధర్నా నిర్వహించారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఆందోళన నిర్వహించారు. వైకాపా నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

సత్యసాయి, అనంతపురం జిల్లాలలో: సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం శ్రేణులు అంబేద్కర్ కూడలి వద్ద రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వైకాపా ప్రభుత్వంలో రౌడీయిజం, గుండాయిజం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. కదిరి, ముదిగుబ్బలో జాతీయ రహదారిపై తెదేపా నాయకులు రాస్తారోకో చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించే వైకాపా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా నేతలు అన్నారు. కళ్యాణదుర్గంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా వైకాపా నాయకుల విధ్యంసంపై కడపలో తెదేపా నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కుప్పం ఘటనతో ప్రభుత్వ పతనం ఆరంభమైందని అన్నారు

విశాఖ, విజయనగరం జిల్లాలలో: విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం నేతలు ఆందోళన నిర్వహించారు. కుప్పంలో వైకాపా సృష్టించిన విధ్వంసం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని విమర్శించారు. విజయనగరం జిల్లా రాజాంలో తెదేపా శ్రేణులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద తెలుగుదేశం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో చేతిలో ఖాళీ ప్లేట్లు పట్టుకుని నిరసన తెలిపారు. పేదవాళ్లకు అన్నం పెడుతుంటే అడ్డుకోవడం దారుణం అన్నారు.

గవర్నర్ ను కలవనున్న తెదేపా నేతలు: తెలుగుదేశం నేతల బృందం శుక్రవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవనున్నారు. కుప్పంలో చంద్రబాబు పర్యటన అడ్డగింత, కావలిలో దళిత యువకుడి ఆత్మహత్య, శ్రీకాకుళం జిల్లా పర్యటనలో లోకేశ్‌ను అడ్డుకోవడం తదితర పరిణామాలపై తెలుగుదేశం నేతలు గవర్నర్ ఫిర్యాదు చేయనున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details