నిధులు, అధికారాలున్న కార్పొరేషన్లను.. సీఎం జగన్ సొంత వర్గానికిచ్చి.. ఏమీ లేని ఛైర్మన్ పదవుల్ని బలహీన వర్గాలకిచ్చారని.. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైకాపాలోని రాజకీయ నిరుద్యోగులకు పదవులు కట్టబెట్టడంపై ఉన్న శ్రద్ధ.. విద్యావంతులైన నిరుద్యోగులపై లేదని విమర్శించారు. B.C, S.C, S.T, మైనార్టీ మంత్రుల్ని డమ్మీల్ని చేశారన్న అచ్చెన్న.. నామినేటెడ్ పదవుల కేటాయింపులోనూ వివక్ష చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రస్థాయి కీలక పదవుల్లో సింహభాగం ముఖ్యమంత్రి సామాజికవర్గంతో నింపేశారని ఆరోపించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ అవకాశాలను దెబ్బతీశారన్నారు. సబ్ ప్లాన్ నిధుల్లోనూ కోత పెట్టారని దుయ్యబట్టారు. బలహీన వర్గాల అణచివేతే లక్ష్యంగా అధికారం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.