SUPREME COURT: ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్పై దాడి చేశారంటూ దాఖలైన కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు, భద్రత సిబ్బందిపై తాము తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు బలవంతపు చర్యలు చేపట్టవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. గచ్చిబౌలి పోలీసులు పెట్టిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టును రఘురామ ఆశ్రయించగా దానిని కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం పిటిషన్ విచారణ చేపట్టింది. రఘురామకృష్ణరాజుకు చెందిన పిటిషన్ను గతంలో తాము విచారించామని, ఇది అదే పిటిషనా అని ధర్మాసనం ప్రశ్నించింది. రెండూ వేర్వేరు అని రఘురామ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు తెలిపారు. పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం ఈ కేసులో తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
ఇదీ జరిగింది..నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడిపై(జులై 5) మంగళవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్పై దాడి చేసినందుకు ఎంపీతోపాటు ఆయన కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ, కానిస్టేబుల్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ మంగళవారం వెల్లడించారు. మరో పక్క కానిస్టేబుల్ ఫరూక్పై దాడికి దిగిన సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండు చేసినట్లు అమరావతిలోని ఏపీ పోలీసు విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు రఘురామ ఇంటివద్ద ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ ఎందుకు ఉన్నాడన్న విషయమై గచ్చిబౌలి పోలీసులు, ఏపీ పోలీసులు భిన్నమైన వాదనలు వినిపించారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ మాట్లాడుతూ... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీ రఘురామ ఇంటివద్ద నిఘాలో భాగంగా కానిస్టేబుల్ ఫరూక్ విధులు నిర్వర్తిస్తున్నారని వెల్లడించగా... ఫరూక్ విధులకు, రఘురామకృష్ణరాజు ఇంటితో ఎలాంటి సంబంధం లేదని ఏపీ పోలీసు విభాగం పేర్కొనడం గమనార్హం.
ఎంపీ ఉన్నదీ లేనిదీ దర్యాప్తు చేస్తున్నాం
దాడి జరిగిన సమయంలో ఎంపీ రఘురామ అక్కడే ఉన్నారా, లేదా? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ చెప్పారు. ‘ఎస్.ఫరూక్ బాషా ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన అనుచరులపై నిఘా ఉంచాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫరూక్ ఈ నెల 4న ఉదయం 8 గంటల ప్రాంతంలో గచ్చిబౌలి బౌల్డర్హిల్స్ కాలనీ ప్రధాన ద్వారంవద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. అదే సమయానికి కాలనీ లోపలి నుంచి ఓ కారులో (7777 నెంబరు కలిగిన తెలుపు రంగు ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్) వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఫరూక్ను బలవంతంగా ఆ వాహనంలో ఎక్కించుకుని ఎంపీ ఉంటున్న విల్లాలోకి తీసుకెళ్లారు. తాను పోలీస్ కానిస్టేబుల్నని చెబుతూ ఐడీ కార్డు చూపినా... పట్టించుకోకుండా ఇష్టానుసారంగా దూషిస్తూ సీఆర్పీఎఫ్ సిబ్బంది దాడి చేశారు.