ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 5, 2020, 2:23 PM IST

Updated : Nov 5, 2020, 4:27 PM IST

ETV Bharat / city

అమరావతి భూముల కేసులో ప్రతివాదులు, డీజీపీ, సిట్​కు నోటీసులు

అమరావతి భూముల అంశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ, సిట్ దర్యాప్తులపై స్టే ఎత్తివేతపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదు. హైకోర్టు ఆదేశాలు సవాలు చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్​ను జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం విచారించింది. స్టే ఎత్తివేయాలన్న ప్రభుత్వ అభ్యర్థన, పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టులో పిటిషన్ వేసిన తెదేపా నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహా డీజీపీ, సిట్​లకు నోటీసుల జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

supreme court hearing on sit on amaravathi lands
అమరావతి భూములపై సుప్రీంలో విచారణ

రాష్ట్ర రాజధాని అమరావతి భూముల అంశంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు సవాలు చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ప్రభుత్వ పిటిషన్​ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.

గత ప్రభుత్వం హయాంలో అవకతవకలు జరిగాయని భావించి జగన్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు. ఆరు నెలల తర్వాత సబ్ కమిటీ నివేదిక ఆధారంగా అమరావతిలో భూ అవకతవకలపై సిట్ ఏర్పాటు చేశారని అన్నారు. ఈ దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే హైకోర్టు స్టే విధించడం సరికాదంటూ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు.

అమరావతి అంశంలో ఏకపక్షంగా వెళ్లడం లేదని... సీబీఐతో దర్యాప్తు జరపాలని కేంద్రానికి లేఖ రాసినట్లు కోర్టు దృష్టికి దవే తీసుకువచ్చారు. ఈ అభ్యర్థనపై కేంద్రం నుంచి స్పందన వచ్చిందా అని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం ప్రశ్నించగా.. ఇంతవరకు లేదని దవే సమాధానం ఇచ్చారు.

గతంలో అధికారంలో నేతలు రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారని.. దాన్ని హైకోర్టు ప్రోత్సహించడం సరికాదని దుష్యంత్ దవే కోర్టుకు విన్నవించారు. ఈ దశలో కలుగజేసుకున్న జస్టిస్ అశోక్ భూషణ్...గత ప్రభుత్వ నిర్ణయాలు సమీక్షించాలని కేబినెట్ సబ్ కమిటీ వేశారా అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. అన్నింటిపై కాదని.. అవకతవకలు జరిగాయని భావించిన అంశాలపైనే కమిటీ వేసినట్లు తెలిపారు. ప్రతివాదులు నోటీసులు జారీచేయాలని దుష్యంత్ దవే కోర్టును కోరారు.

స్టే ఎత్తివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోని ధర్మాసనం... నాలుగు వారాల్లో పిటిషన్​పై, స్టే ఎత్తివేయాలన్న అంశాలపై సమాధానం ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్ర, డీజీపీ, సిట్​కు శ్రీముఖాలు అందించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:నూతన ఇసుక విధానానికి మంత్రి వర్గం ఆమోదం

Last Updated : Nov 5, 2020, 4:27 PM IST

ABOUT THE AUTHOR

...view details