సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పుష్ప’. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్గా నటించిన విషయం తెలిసిందే. పోలీసుల కంట పడకుండా ఎర్ర చందనాన్ని రాష్ట్రం దాటిస్తుంటాడు. అయితే, నిజ జీవితంలోనూ ఓ వ్యక్తి ‘పుష్ప’ను స్ఫూర్తిగా తీసుకొని రూ.కోట్లు విలువ చేసే ఎర్ర చందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ట్రక్కు డ్రైవర్గా పనిచేస్తున్న యాసిన్ ఇనయాతుల్లా.. కర్ణాటక-ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్రకు వెళ్లే క్రమంలో ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడు. తన ట్రక్కులో మొదట ఎర్ర చందనం దుంగల్ని పెట్టి.. దానిపై పండ్లు, కూరగాయాల డబ్బాలను ఉంచాడు. పైగా ట్రక్కుకు ‘కొవిడ్ - 19, నిత్యావసర ఉత్పత్తులు’ అని స్టిక్కర్ కూడా అతికించాడు. అలా ఆంధ్రప్రదేశ్లోని అన్ని చెక్ పోస్టులను సునాయాసంగా తప్పించుకొని మహారాష్ట్రకు చేరుకున్నాడు. సంగ్లీ జిల్లాలోని గాంధీ చౌక్ వద్దకు రాగానే అక్కడి పోలీసులు ట్రక్కును అడ్డుకొని తనిఖీ చేయగా.. అసలు బండారం బయటపడింది.