భూముల రీ సర్వే పూర్తయిన 51 గ్రామాల్లో ప్రభుత్వం త్వరలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది. ఆయా గ్రామాల్లోని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభయ్యాక.. దస్తావేజుల్ని సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపిస్తారు. ఎలాంటి అభ్యంతరాల్లేవని అక్కడి నుంచి సమాధానం వస్తేనే తదుపరి ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు చేసింది. ఈ విధానంతో ప్రజలకు సౌలభ్యం ఉన్నా.. తొలిసారి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. దస్తావేజుల రిజిస్ట్రేషన్లలో సాంకేతిక సమస్యలు వస్తే వాటిని పరిష్కరించేందుకు సచివాలయాల్లో ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉంది.
ఆస్తి బదలాయింపు చట్టం-1882, భారత ఒప్పందాల చట్టం-1872, భారత వారసత్వ చట్టం-1925 తదితర 16 ముఖ్య చట్టాలపై పంచాయతీ కార్యదర్శులకు పక్కాగా అవగాహన కల్పించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియపై సచివాలయ సిబ్బందికీ శిక్షణ ఇవ్వాలి. సీనియర్ సబ్ రిజిస్ట్రార్లలో కొందరికి ఇప్పటికీ చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన లేదు. ఈ నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ అధికారాలను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా బదలాయించబోతున్నారు. అధికారాల బదలాయింపునకు చట్ట సవరణ అవసరమవుతుందని అధికారులు చెప్పారు.