ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 17, 2022, 4:54 AM IST

ETV Bharat / city

return: మూడో రోజూ ఘనంగా సాగిన సంక్రాంతి సంబరాలు

return: రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజునా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయాలకు పోటెత్తిన భక్తులు... ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు చోట్ల పశువుల పోటీలతో పాటు.. వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. సొంతూళ్లలో కుటుంబంతో సహా వేడుకలు చేసుకుని మధురానుభూతులను మిగిల్చుకున్న వారంతా.. పట్టణాలకు తిరుగు బయల్దేరారు.

మూడో రోజూ ఘనంగా సాగిన సంక్రాంతి సంబరాలు
మూడో రోజూ ఘనంగా సాగిన సంక్రాంతి సంబరాలు

మూడో రోజూ ఘనంగా సాగిన సంక్రాంతి సంబరాలు

return: సంబరాల సంక్రాంతి ముగిసింది. ఆఖరిదైన కనుమ రోజునా.. పల్లె, పట్టణాల్లో సంబరాలు కనుల విందుగా సాగాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురంలోని రామలింగేశ్వర స్వామి మహా రథోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజల అనంతరం.. మహా రథోత్సవం వేడుకగా సాగింది. ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. కడప జిల్లా రాయచోటిలో బసవన్నలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. కాటమరాజు గుడి చెంతకు తీసుకెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


పండుగ సంబరాల్లో భాగంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాలో... ముగ్గుల, ఆటల పోటీలు నిర్వహించారు. టంగుటూరు ఊరు చెరువులో శ్రీ రాములోరి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. చీరాల మండలంలోని దేవాంగపురిలో ముగ్గులు పోటీలు నిర్వహించి.. విజేతలకు చీరలు పంపిణీ చేశారు. కనుమ పండగను పురస్కరించుకుని నెల్లూరులో పార్వేట ఉత్సవం వేడుకగా జరిగింది. సకల దేవతలు కొలువుదీరే ఈ పార్వేట ఉత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నగరంలోని పలు ఆలయాల ఉత్సవమూర్తులు నవాబుపేట, కిసాన్‌నగర్‌ ప్రాంతాల్లో కొలువుదీరారు. కొవిడ్‌ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే దేవాతామూర్తులను ప్రతిష్టించారు. అనంతరం తెప్పోత్సవం వైభవంగా సాగింది. వెంకటగిరిలోని కుమ్మరిగుంట పుష్కరణిలో సాయిబాబాకు తెప్పొత్సం చేశారు.


శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస సంగమేశ్వర జాతర ఘనంగా జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఒడిశా నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు సంగమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పొందూరు మండలం లోలుగులో ఎడ్లబండి పోటీలు సందడిగా సాగాయి. కనుమ సందర్భంగా విశాఖ బీచ్‌కు జనం పోటెత్తారు. సందర్శకులతో సాగర తీరం కిటకిటలాడింది. మునగపాకలో నిర్వహించిన గుర్రపుస్వారీ పోటీలు ఆకట్టుకున్నాయి.


పల్లెల నుంచి తిరిగి పట్నం బాట పట్టిన వారితో.. ప్రయాణ ప్రాంగణాలు తిరిగి రద్దీగా మారాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని.. బస్టాండ్లలో రద్దీని గమనిస్తూ ఎప్పటి కప్పుడు అవసరమైతే అదనంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కరోనా, ఒమిక్రాన్‌ వ్యాప్తి దృష్ట్యా అదనపు బస్సులు, రైళ్లను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

పాత బావి విషయంలో గొడవ.. కొడవళ్లు, రాళ్లతో దాడికి ఎమ్మెల్సీ వర్గీయుల యత్నం

ABOUT THE AUTHOR

...view details