ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 6, 2020, 7:40 AM IST

ETV Bharat / city

ప్రైవేటు సంస్థల చేతికి ఇసుక రీచ్​లు.. అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?

రాష్ట్రంలో ఇసుక రీచ్​లన్నీ ఒకే సంస్థకు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇసుక వెలికితీత, సరఫరా బాధ్యతలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు అప్పజెప్పాలని, వారు కాదంటే బహిరంగ వేలం ద్వారా ప్రైవేటుకే ఆ బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర సంస్థలు ముందుకొచ్చే అవకాశం తక్కువే అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇసుక సరఫరా ప్రైవేటు సంస్థల చేతికి వెళ్తే.. సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

sand reaches to private persons.. pro and cons special story
ప్రైవేటు సంస్థల చేతికి ఇసుక రీచ్​లు

భారీ యంత్రాంగం, అన్ని వ్యవస్థలూ అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు, సరఫరా చేపడుతుంటేనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ బాధ్యతలను ప్రైవేటుపరం చేస్తే వాటిని నిలువరించటం సాధ్యమవుతుందా అన్న అనుమానాలు నిర్మాణరంగ నిపుణుల నుంచి వస్తున్నాయి. ప్రైవేటు సంస్థలతో ధరలు నియంత్రించగలరా అని అడుగుతున్నారు. ఇసుక తవ్వకాలు, అమ్మకాల బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు తీసుకోవడం కష్టమని చెబుతున్నారు. అలాగని రీచ్‌లను ప్రైవేటుకు అప్పగిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కొత్త ఇసుక విధానంపై నిర్మాణరంగ నిపుణులు పలు సందేహాలు లేవనెత్తుతున్నారు.

ప్రైవేటు చేతికెళ్తే..

ఇసుక వ్యాపారంలోకి భారీ నిర్మాణసంస్థలే వస్తాయని, అలాంటి సంస్థలు లాభాపేక్షకే పెద్దపీట వేస్తాయన్న భావనను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎస్‌ఈబీని ఏర్పాటుచేసి కఠిన చర్యలు తీసుకున్నా అక్రమాలకు అడ్డుకట్ట పడలేదు. మరి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తమిళనాడు అనుభవమే గుణపాఠం

2006లో తమిళనాడు ప్రభుత్వం ఇసుక వ్యాపారాన్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టి చేతులు కాల్చుకుంది. వారు మీటరు మేర తవ్వేందుకు అనుమతి ఉన్న చోట.. ఐదు మీటర్ల మేర తవ్వేశారు. రూ.కోట్లలో డబ్బు సంపాదించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడగా, సామాన్యులకూ ఇసుక అందలేదు. దాంతో 2011లో అక్కడి ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దుచేసింది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు.. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థల ద్వారానే ఇసుక తవ్వకాలు చేపడుతున్నాయి.

కేంద్ర సంస్థలొచ్చే అవకాశాలు తక్కువే

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రధానమైన జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థే (ఎన్‌ఎండీసీ) పలు రాష్ట్రాల్లో ఇనుము, బొగ్గు తదితర గనుల తవ్వకాలు చేపడుతోంది. ఒకేచోట పెద్ద గనిలో తవ్వడం వేరు, రాష్ట్రవ్యాప్తంగా అనేక రీచ్‌లలో ఇసుక తవ్వి, విక్రయించటం వేరు. అందుకు పెద్ద ఎత్తున మానవ వనరులు అవసరం. ఈ అంశాల్లో ఎన్‌ఎండీసీకి ఉన్న పరిమితుల దృష్ట్యా ఆసక్తి చూపించకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి:

పాఠశాలకూ పాకిన మహమ్మారి.. వైరస్ బారిన పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

ABOUT THE AUTHOR

...view details