ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Sajjala: 'ప్రభుత్వం మంచి చేస్తుంటే.. ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి'

By

Published : Jan 1, 2022, 4:30 PM IST

sajjala slams opposition parties: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల తీరుపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల విమర్శలు గుప్పించారు. పలు కార్యక్రమాల పేరుతో ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా కేవలం మతపరమైన అంశాలను లెవనెత్తడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి మంచి ప్రతిపక్ష పార్టీలు అవసరమని సజ్జల వ్యాఖ్యానించారు.

sajjala ramakrishna reddy
sajjala ramakrishna reddy

sajjala slams opposition parties:ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేస్తుంటే.. కొందరు మాత్రమే అనేక అంశాల పేరుతో కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శించారు. గతంలో ఆదర్శవంతమైన రాజకీయాలు ఉండేవని.. ప్రస్తుతం అన్నీ దిగజారిపోయాయని వ్యాఖ్యానించారు. నాటి ఆదర్శాలను ప్రస్తుత రోజుల్లో ఆచరించి.. చూపించేందుకు సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే వామపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని ఆక్షేపించారు.

sajjala slams BJP: భాజపాకి ప్రజలకు సంబంధించిన అంశాలు కావాలా..? లేక మతపరమైన అంశాలు కావాలా? అనేది ఆలోచించాలని సజ్జల సూటిగా ప్రశ్నించారు. సిలువ, మసీదులపై భాజపా నేతలు మాట్లాడటం ఏమిటని నిలదీశారు. తెదేపా దింపుడుగల్లం ఆశలతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ విలువైన మానవ వనరులను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టం చేశారు. వచ్చే 10-15 ఏళ్ళలో మంచి విద్యావంతులైన యువత ఇక్కడ సంపద సృష్టిస్తారని పేర్కొన్నారు.

sajjala fires on TDP: వైకాపా ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహంతో పని చేస్తోందని సజ్జల చెప్పుకొచ్చారు. తాము తీసుకుంటున్న నిర్ణయాల ఫలితమే స్థానిక సంస్థల్లో విజయాలు దక్కాయని స్పష్టం చేశారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ విప్లవం సృష్టిస్తోందన్నారు. రాజకీయ పార్టీలకు ఓ విధానం ఉండాలన్నారు. జగన్ పెట్టిన సంక్షేమ అజెండానే ఇక ఏపీ రాజకీయాల్లో శాశ్వతంగా ఉండబోతోందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు పాత రాజకీయాలు చేస్తే ప్రజల్లో కనుమరుగు అయిపోతారని అన్నారు. ఏపీకి ఇప్పుడు మంచి ప్రతిపక్ష పార్టీలు అవసరమని సజ్జల వ్యాఖ్యానించారు. రాజకీయ దురుద్ధేశాలతో లేకుండా విమర్శలు చేస్తే మార్చుకోవడానికి తాము సిద్ధమని సజ్జల తేల్చి చెప్పారు.

"కొత్త ఏడాదిలో ప్రజలకు మరింత దగ్గరయ్యే నిర్ణయాలు ఉంటాయి. రాష్ట్ర విభజన కష్టాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మా ప్రభుత్వం వచ్చిన 8 నెలలకే కరోనా కష్టాలు వచ్చాయి. అనేక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు అమలు చేశాం. ప్రతిపక్షాల ఆరోపణల కంటే లబ్ధిదారుల చిరునవ్వే మాకు ముఖ్యం. వచ్చే ఎన్నికల్లోగా 80 లక్షల కుటుంబాలు సొంతింట్లో ఉండాలనేది లక్ష్యం" - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు

ఇదీ చదవండి:

మద్యం వద్దు.. పాలు ముద్దు.. రావణుని న్యూ ఇయర్​ సందేశం!

ABOUT THE AUTHOR

...view details