పంచాయతీ ఎన్నికల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రమేశ్కుమార్, ఆయన్ను వెనకుండి నడిపించే చంద్రబాబు ఇద్దరూ హైదరాబాద్లో కూర్చుని ఇక్కడ ఉద్యోగులు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ‘సుమారు 31 లక్షల మందికి ఇంటి పట్టాలతో ఆస్తి హక్కు కల్పించాం, ఈ సమయంలో ఎన్నికలు జరిగితే మాకే మంచిది. ప్రజలు, ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదనే ముఖ్యమంత్రి టీకాల ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలు నిర్వహించాలని కోరారు’ అని చెప్పారు.
పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకు : సజ్జల రామకృష్ణారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డి తాజా వార్తలు
ఎస్ఈసీ, చంద్రబాబు హైదరాబాద్లో కూర్చుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని .. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎన్నికల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు.
![పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకు : సజ్జల రామకృష్ణారెడ్డి sajjala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10332717-148-10332717-1611279070903.jpg)
గురువారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘ఎన్నికలు జరిగే కొద్దిరోజులే ఎస్ఈసీ బాస్. ఆ 15 రోజుల్లో ఆయనేం చేస్తారు? తప్పుడు కేసులు పెట్టొచ్చు, కానీ, దానికి ప్రభుత్వం భయపడుతుందా?’ అని ప్రశ్నించారు. ‘తెదేపా నేత కళా వెంకటరావును విచారణ కోసం పోలీసులు పిలిస్తే అరెస్టు చేశారంటూ చంద్రబాబు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని అరెస్టు చేసి, పోలీసు కస్టడీకి కూడా కోర్టు ఇచ్చినా, ప్రవీణ్ను డీజీపీ ఇంట్లో దాచారా? జగన్మోహన్రెడ్డి ఇంట్లో పెట్టారా అన్న చంద్రబాబు మాటలు చూస్తే ఆయన మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతోంది’ అని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని అప్పీలు