ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 30, 2020, 4:53 PM IST

ETV Bharat / city

హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడు.. అలా దొరికిపోయాడు

ఆ యువకుని ఆన్​లైన్ బెట్టింగ్ వ్యసనం.. కన్నతల్లిని, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన చెల్లిని హతమార్చేలా దిగజార్చింది. అత్యాశకు పోయిన యువకుడు బెట్టింగ్​కు బానిసై.. అప్పు చేయడమే గాక కుటుంబ సభ్యులను హత్య చేయడం కలకలం రేపింది. బెట్టింగ్​కు బానిసై.. నాలుగు రోజుల క్రితం తెలంగాణలోని వనస్థలిపురంలో ఒకరు బలికాగా.. మేడ్చల్ మండలం రావల్‌కోల్‌లో సాయినాథ్‌రెడ్డి అనే యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. విషం పెట్టి కుటుంబ సభ్యులను హత్యచేసి ఏమీ ఎరగనట్టుగా నాటకం ఆడాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

murder for betting money in medchal
హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడు.. అలా దొరికిపోయాడు

హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడు.. అలా దొరికిపోయాడు

తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా రావల్‌కోల్‌లో దారుణం జరిగింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసైన యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. విషం కలిపి తల్లి, చెల్లిని హత్య చేశాడు. ఆదివారం రాత్రి జరిగిన కిరాతక చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రావల్‌కోల్‌కు చెందిన సాయినాథ్‌రెడ్డి తండ్రి ప్రభాకర్‌రెడ్డి ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల పేరుతో బ్యాంకులో ఉన్న రూ. 25 లక్షలను డ్రా చేసి, బెట్టింగ్‌లో పోగొట్టాడు. దీనిపై గొడవ జరుగుతుందని అనుమానించిన సాయినాథ్‌రెడ్డి.. ఈ నెల 23న భోజనం వండుతుండగా రసాయన గుళికలు కలిపాడు. విషపూరిత భోజనం చేశాక.. తల్లి, చెల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 27న చెల్లి అనూష మృతి చెందగా.. మరుసటి రోజే ఈ నెల 28న తల్లి సునీత ప్రాణాలు కోల్పోయారు.

తల్లి, చెల్లి ఆస్పత్రి బిల్లులు చెల్లించడం కోసం.. 15 తులాల బంగారు నగలు కుదవ పెట్టగా.. అనుమానం వచ్చిన బంధువులు సాయినాథ్‌రెడ్డిని నిలదీశారు. అసలు విషయం తెలుసుకుని విస్మయపోయారు. పోలీసులకు సమాచారం అందించగా.. దర్యాప్తులో సాయినాథ్​ రెడ్డి అసలు విషయం బయటపెట్టాడని మేడ్చల్ సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.

సాయినాథ్‌రెడ్డి ఇంతటి కిరాతకానికి ఒడిగడతాడని తాము కలలోనూ ఊహించలేదని అతని మేనమామ పెంటారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. అతనికి ఉరిశిక్ష పడేలా చూడాలని పోలీస్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details