ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 24, 2022, 10:40 PM IST

ETV Bharat / city

APCC: 'ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రభుత్వం తీరు'

అమలాపురం ఘటనతో భారత రాజ్యాంగ నిర్మాతకు ఘోర అవమానం జరిగిందని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టినందుకు ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

APCC
APCC

అమలాపురం ఘటన దురదుష్టకరమని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరు పెట్టినందుకు ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో భారత రాజ్యాంగ నిర్మాతకు ఘోర అవమానం జరిగిందని చెప్పారు. ఒక్క కోనసీమ జిల్లాకే కాదు..యావత్ దేశానికే "మహాత్మా గాంధీ - డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశం" అని పేరు పెట్టాలని సూచించారు.

కొత్తగా జిల్లా ఏర్పాటు చేసినప్పుడు వెలువడిన గెజిట్​లో పేరు పెట్టకుండా ఇప్పుడు హడావుడిగా పేరు మార్పు చూస్తుంటే ఇది జగన్ రెడ్డి రాజకీయ కుట్రలో భాగంగా తెలుస్తోందన్నారు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ అంబేడ్కర్​పై గౌరవ భావం ఉంటుందని చెప్పారు. అలాంటి మహనీయుడి పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చటం దురదృష్టకరమని పేర్కొన్నారు. జేఏసీల ముసుగులో దాడులకు పాల్పడ్డ వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.

ఏం జరిగిందంటే..:'కోనసీమ ముద్దు - వేరే పేరు వద్దు' అనే నినాదంతో కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళకారులు అన్ని వైపుల నుంచి పట్టణంలోకి చొచ్చుకొచ్చారు. బస్టాండ్‌తో పాటు ముమ్మిడివరం వైపు నుంచి గడియారం స్తంభం వద్దకు ప్రదర్శనగా చేరుకున్నారు. పోలీసులు వారిని నియంత్రించేందుకు యత్నించారు. లాఠీలతో చెదరగొట్టారు. అయినా నిరసనకారులు వెనకడుగు వెయ్యలేదు. సమయం గడిచేకొద్దీ వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్న జిల్లా ఎస్పీ.. రోడ్లపైకి వచ్చిన నిరసనకారుల్ని వాహనాల్లో తరలించేందుకు యత్నించగా వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. కొందరు యువకులను అరెస్టు చేసి బస్సుల్లో తరలిస్తుండగా.. బస్సును వెంబడించి ధ్వంసం చేశారు. ఈ క్రమంలో నల్లవంతెన వద్ద ఆందోళనకారులపై లాఠీలు ఝళిపించారు. దీంతో రెచ్చిపోయిన యువకులు పోలీసులపై రాళ్లు రువ్వారు. రాళ్లదాడిలో జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తృటిలో తప్పించుకున్నారు. ఘటనలో పలువురు పోలీసులతో పాటు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. అనంతరం కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. రెచ్చిపోయిన ఆందోళన కారులు రెండు బస్సులకు నిప్పు పెట్టారు. మరో బస్సు అద్దాలు ధ్వసం చేశారు.

అనంతరం అమలాపురం బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్‌ ఇంటికి వేలాదిగా తరలివచ్చిన నిరసన కారులు ఇంటిపై రాళ్ల దాడి చేశారు. ఇంటి అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. మంత్రి ఇంటి వద్ద ఉన్న పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనం, ఓ ద్విచక్రవాహనాన్ని తగులబెట్టారు. అనంతరం మంత్రి ఇంటికి కూడా నిప్పుపెట్టారు. దాడికి ముందే మంత్రి కుటుంబసభ్యులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. మంత్రి విశ్వరూప్‌ సతీమణి, పిల్లలను కారులో వేరే ప్రాంతానికి తరలించారు. హౌసింగ్‌బోర్డు కాలనీలోని ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి కూడా ఆందోళన కారులు నిప్పు పెట్టారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details