ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 14, 2021, 7:03 AM IST

ETV Bharat / city

Retired IAS officer died:విశ్రాంత ఐఏఎస్‌ అధికారి.. దానం కన్నుమూత

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బొమ్మాజి దానం (79) కన్నుమూశారు. రాత్రివేళ నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దానం కన్నుమూత
విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దానం కన్నుమూత

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బొమ్మాజి దానం (79) హైదరాబాద్‌ సోమాజిగూడలోని తన నివాసంలో కన్నుమూశారు. రాత్రి పడుకున్న ఆయన.. ఉదయం నిద్ర లేవలేదు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా కంభం మండలం పెద్దనల్లకాలువ గ్రామం. సాధారణ దళిత కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి అనేక హోదాల్లో పనిచేశారు. ఆయనకు భార్య సరోజిని, నలుగురు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు ఆదాయపన్ను శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. మరొకరు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు. సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే విజయకుమార్‌ బొమ్మాజి దానం కుమారుడే.

మూడో కుమారుడు అమెరికాలో ఐటీ కంపెనీలో ఉన్నతోద్యోగిగా, నాలుగో కుమారుడు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. 1971 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన దానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టరుగా పనిచేశారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా, కార్యదర్శిగా, కార్మిక, ఉపాధి శాఖ ముఖ్య కార్యదర్శిగా, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా సేవలందించారు. కొల్లేరు సరస్సు సుందరీకరణతో పాటు పరిసరాల్లో మంచి నీటి చేపల చెరువు అభివృద్ధికి కృషి చేసిన అధికారిగా పేరు గడించారు. దానం అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం స్వగ్రామంలో నిర్వహిస్తామని చిన్న కుమారుడు అనిల్‌ తెలిపారు. పలువురు విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, దళిత సంఘాల నేతలు ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బి.దానం మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు.

ఇదీ చదవండి:

అమిత్ షా తిరుపతి పర్యటన.. సీఎం జగన్​తో కలిసి శ్రీవారి దర్శనం

ABOUT THE AUTHOR

...view details