ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TANA TELUGU VELUGU: "అక్షర సేద్యంతో చెరగని ముద్రవేసిన.. సాహితీ రుషులను స్ఫూర్తిగా తీసుకోవాలి" - ఏపీ తాజా వార్తలు

TANA TELUGU VELUGU: అక్షరసేద్యంతో తెలుగునాట చెరగని ముద్రవేసిన సాహితీ రుషులను స్ఫూర్తిగా తీసుకొని.. తెలుగు భాషను సుసంపన్నం చేసుకోవాలని సాహితీ వేత్తలు పిలుపునిచ్చారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్యర్యంలో నిర్వహించిన "నెల నెలా తెలుగు వెలుగు" కార్యక్రమంలో.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సహా ప్రముఖ గేయ రచయితల సాహితీ సేవలను మననం చేసుకున్నారు.

TANA TELUGU VELUGU
TANA TELUGU VELUGU

By

Published : Dec 27, 2021, 5:16 PM IST

తానా నెల నెల తెలుగు వెలుగు

TANA TELUGU VELUGU: తరతరాలకు స్ఫూర్తినిచ్చే ప్రఖ్యాత సాహితీవేత్తల ప్రత్యక్ష పరిచయాలు- ప్రత్యేక అనుభవాలను తానా ప్రపంచ సాహిత్య వేదిక ఈ నెలలో అందించింది. వర్చువల్​గా జరిగిన ఈ కార్యక్రమానికి తోటకూర ప్రసాద్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. సిరివెన్నెలతో తానా ప్రపంచ సాహిత్య వేదికకు ఉన్న అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.... ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు.

యువశక్తిని తట్టిలేపే.. స్పృహ కలిగించే పాట, జాతీయ సమైక్యతాభావం ఇలా ఆయన ఏది తీసుకున్న కూడా ఒక ఆణిముత్యమే. ఇంత నిబద్ధతతో పాటలను రాసే గీతరచయిత ఉండరని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన రచించిన పాటలు సినిమా, సినిమాయేతర సాహిత్యం మొత్తాన్ని పోగు చేసే అవకాశం కలుగుతుంది. త్వరలోనే ఆ ప్రక్రియ బాధ్యత తానా ప్రపంచ సాహిత్య వేదికపై ఉంది. -తోటకూర ప్రసాద్‌, తానా సమన్వయ కర్త

సిరివెన్నెల సీతారామశాస్తితో తమకున్న అనుబంధాన్ని ఆయన గురువు సత్యారావు మాస్టార్‌తో పాటు కౌముది మాసపత్రిక సంపాదకులు కిరణ్‌ ప్రభ తానా ప్రపంచ సాహిత్య వేదికతో పంచుకున్నారు.

జీవితమంతా మలుపులు తిరిగింది. తండ్రిని కోల్పోయారు. కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నమైంది. జీవితం ఎదగకుండా ఆగిపోయింది. ఇలాంటి సమయంలో ఓ గోల్డెన్ ఆఫర్ వచ్చింది. పరీక్షలు వచ్చే ఏడాది అయినా రాసుకోవచ్చు వెళ్లమని సూచించా. అప్పుడు వెళ్లి... ఆ విధాత తలపున ప్రభవించినది..... అనే పాటను రాశారు. -సత్యారావు, సిరివెన్నెల గురువు

ఎవరినీ కూడా శాస్త్రి, సిరివెన్నెల అని పిలవనివ్వరు. ఆయన ఒక బంధం ఏర్పరుచుకుంటారు. బాబాయ్ అని.. అన్నయ్య అని ఇట్లాంటి బంధం ఏర్పరుచుకుంటారు. అందుకే జగమంత కుటుంబం అనేమాట ఆయనకు నూటికి నూరు శాతం వర్తిస్తుంది. -కిరణ్‌ ప్రభ, కౌముది మాసపత్రిక సంపాదకులు

విశ్వనాథ సత్యనారాయణతో తమకున్న ప్రత్యక్ష అనుభవాలను పలువురు వివరించారు. అలాగే శ్రీశ్రీతో ఉన్న అనుభవాలను ఆయన సహచరుడు రాజు తెలిపారు. ఆచార్య ఆత్రేయ శత జయంతి సంవత్సరం వేళ ఆయన సాహిత్య సేవను తానా ప్రపంచ సాహిత్య వేదిక గుర్తు చేసుకుంది. ఆత్రేయ శిష్యుడైన జె.కె.భారవి ఆయనతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. తరగని సాహిత్య సంపదను తెలుగు ప్రజలకు అందించిన ప్రఖ్యాత సాహితీవేత్తలను యువ రచయితలు స్ఫూర్తిగా తీసుకోవాలని.. తానా ప్రపంచ సాహిత్య వేదిక పిలుపునిచ్చింది.

ఇదీ చదవండి:Encounter At Telangana Chhattisgarh Border : ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో ఎన్​కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ABOUT THE AUTHOR

...view details