ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Hyderabad Real Estate: హైదరాబాద్​లో కళ్లు తిరిగేలా పెరుగుతున్న ఇళ్ల ధరలు

By

Published : Feb 1, 2022, 10:32 AM IST

Hyderabad Real Estate: తెలంగాణలోని హైదరాబాద్‌లో గృహ నిర్మాణ రంగం వేగంగా పరుగులు తీస్తున్నట్లు కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. అత్యధిక గృహ లావాదేవీలు జరుగుతున్న.. 8 రాష్ట్రాల్లో భాగ్యనగరం ఉన్నట్లు పేర్కొంది. కొవిడ్‌ ముందునాటి పరిస్థితులతో పోలిస్తే రెండో వేవ్‌లో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు, లావాదేవీలు భారీగా పెరిగినట్లు వెల్లడించింది.

Hyderabad Real Estate
Hyderabad Real Estate

Hyderabad Real Estate: 2019 ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలంతో పోలిస్తే తెలంగాణలోని హైదరాబాద్‌లో కొవిడ్‌ తొలి ఉద్ధృతి ఉన్న 2020 ఏప్రిల్‌-జూన్‌ మధ్య ఇళ్ల లావాదేవీలు 37.6% పడిపోయినా.. 2021 ఏప్రిల్‌-జూన్‌ మధ్య 37.9% పెరిగినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. ఇళ్ల ధరలు తొలి వేవ్‌లో12.3% పెరగ్గా, రెండో వేవ్‌ సమయంలో 21.3% పెరిగినట్లు సర్వే వివరించింది. గాంధీనగర్, అహ్మదాబాద్‌ తర్వాత ఇళ్ల ధరల పెరుగుదల ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉన్నట్లు పేర్కొంది. లావాదేవీల్లో వృద్ధి కూడా బెంగుళూరు తర్వాత హైదరాబాద్‌లోనే... ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

తెలంగాణ ఏర్పడిన తొలి ఆరేళ్లలో రెండంకెల మేర నమోదైన రాష్ట్ర నికర ఉత్పత్తి వృద్ధిరేటు 2020-21లో 2.5%కి పడిపోయింది. 2011-22 సిరీస్‌ను అనుసరించి తాజా ధరల ప్రకారం తెలంగాణ నికర రాష్ట్ర ఉత్పత్తి వృద్ధిరేటు 2014-15లో 11.8%, 2015-16లో 14.6%, 2016-17లో 14.3%, 2017-18లో 13.7%, 2018-19లో 15%, 2019-20లో 11.6% నమోదు కాగా 2020-21లో 2.5%కి పడిపోయింది.

తగ్గుతున్న సేవారంగం వృద్ధిరేటు..

Economic Survey 2022: హైదరాబాద్‌లో అటవీ విస్తరణ 2011తో పోలిస్తే 2021 నాటికి 146.8% వృద్ధిచెందింది. భాగ్య నగరంలో 2011లో 33.2 చదరపు కిలోమీటర్ల మేర అటవీ కవరేజి ఉండగా 2021 నాటికి 81.8 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని ఆర్థిక సర్వే తెలిపింది. తెలంగాణలో సేవా రంగం వృద్ధిరేటు మూడేళ్లుగా తగ్గుతూ వస్తున్నట్లు ఆర్థిక సర్వే తెలిపింది. 2018-19లో 7.91% ఉన్న సేవా రంగం వార్షిక వృద్ధిరేటు 2019-20 లో 5.69 శాతానికి తగ్గిపోయింది. 2020-21 నాటికల్లా మైనస్‌ 3.94%కి పడిపోయింది.

ఆ జాబితాలో తెలంగాణ..

గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం కుటుంబాలకు తాగునీటి సౌకర్యం కల్పించిన 6 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందని ఆర్థిక సర్వే వివరించింది. తెలంగాణలో మెరుగైన పారిశుద్ధ్య వసతులతో కూడిన ఇళ్లలో జీవించే వారి సంఖ్య 2015-16 నాటికి 76.2% ఉండగా 2019-21 నాటికి 52.3%కి పడిపోయింది. ఇదే సమయంలో వంట కోసం శుద్ధ ఇంధనం వినియోగించే కుటుంబాల సంఖ్య 91.8% నుంచి 67.3%కి పడిపోయింది. తెలంగాణలో సంతాన సాఫల్య రేటులో మార్పు లేదు. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ 2020-21లో... తెలంగాణ 69 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది. నేషనల్‌ అడాప్టేషన్‌ ఫండ్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ కింద తెలంగాణలో 24 కోట్ల విలువైన ప్రాజెక్టులు నడుస్తున్నాయి. దేశంలో తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో పొగాకు పండించే రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించేయత్నం జరుగుతోంది. ఇందుకోసం ఈ 10 రాష్ట్రాలకు కలిపి 10 కోట్ల రూపాయలు కేటాయించారు.

ఇదీచూడండి:Union budget 2022: పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌... ఆంధ్రా ఆశలు ఫలించేనా?

ABOUT THE AUTHOR

...view details